JanaSena: పవన్ కల్యాణ్ ఒంటరి?: జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన చిరంజీవి, రాపాక..!
అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేసే యోచన ఉందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే శాసనసభ సాక్షిగా చేసిన ప్రకటన రాజకీయ ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ జగన్ సూచనప్రాయంగా వెల్లడించిన నిర్ణయాన్ని స్వాగతించాల్సిన స్థితికి తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ దీనిపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోండగా.. తెలుగుదేశం పార్టీ ఎటూ తేల్చుకోలేక సతమతమౌతోంది. జనసేన పార్టీ నిర్ద్వందంగా వ్యతిరేకించింది.
తెలుగుదేశం యూటర్న్..
మూడు రాజధానుల అంశంపై ప్రస్తుతం రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల మధ్య జనసేన పార్టీ ఒంటరిగా మారినట్టు కనిపిస్తోంది. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించాలనే వైఎస్ జగన్ నిర్ణయాన్ని తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఆ తరువాత కాస్త మెట్టు దిగింది. విశాఖ అంశంపై ఎవరూ స్పందించ వద్దంటూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు క్యాడర్ కు సూచించడమే దీనికి నిదర్శనం.
తటస్థులు కూడా..
ఆరంభం నుంచీ వైఎస్ జగన్ పట్ల గానీ, ఆయన సారథ్యాన్ని వహిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై గానీ.. ఏ అంశంపైనా సమర్థించని లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ వంటి తటస్థులు సైతం మూడు రాజధానుల అంశాన్ని స్వాగతించాయి. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల అంశాన్ని ఒక్క పవన్ కల్యాణ్ మాత్రమే.. విభిన్న స్వరాన్ని వినిపిస్తున్నారు. నిండు సభలో వైఎస్ జగన్ సూచన ప్రాయంగా తన నిర్ణయాన్ని, ఆలోచనను పంచుకున్న వెంటనే పవన్ కల్యాణ్.. ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించారో.. ఇప్పటికీ ఆయన దానికే కట్టుబడి ఉన్నారు.
చిరంజీవి, రాపాక సమర్థించిన నేపథ్యంలో..
పవన్ కల్యాణ్ సోదరుడు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి, జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు ఇవ్వడం, మూడు రాజధానులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బహిరంగంగా ప్రకటించడం.. పవన్ కల్యాణ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది. కొన్ని సంవత్సరాల తరువాత చిరంజీవి.. కేంద్ర మాజీమంత్రి హోదాలో స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అనూహ్యంగా తెరపైకి చిరంజీవి..
జనసేన పార్టీతో చిరంజీవికి ఎలాంటి సంబంధమూ లేదు. ఆ పార్టీలో ఆయనకు కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. అలాంటి చిరంజీవి చేసిన ప్రకటనను జనసేన పార్టీ కోణంలో చూడాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ- పవన్ కల్యాణ్ కు రాజకీయ గురువు, ఆదర్శనీయుడు..కుటుంబ సభ్యుడు చిరంజీవి. మూడు రాజధానులపై ఆయన కేంద్ర మాజీమంత్రి హోదాలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేయడం అనూహ్య పరిణామంగా భావిస్తున్నారు.
మరోసారి జగన్ ను సమర్థించిన రాపాక..
ఇక పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బహిరంగంగానే మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు. తన చేతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే సైతం పవన్ కల్యాణ్ కు గానీ, పార్టీ మూల సిద్ధాంతానికి గానీ కట్టుబడి లేరు. ఈ పరిస్థితుల మధ్య పవన్ కల్యాణ్ మున్ముందు ఎలా స్పందిస్తారు? మూడు రాజధానులపై తన వైఖరిని కొనసాగిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.