పవన్ పిచ్చి కుక్క అయితే జగన్ అదే.. వైసీపీ నేతల మదం అణిచేస్తాం: జనసేన ఫైర్.. నిరసనలు
''అటు బీజేపీతో ఉంటూనే ఇటు టీడీపీతో అంటకాగుతూ, చంద్రబాబు తాబేదారుగా పనిచేస్తున్న పీకే కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటున్నాడు. పీకే అంటే అందరికీ పవన్ కల్యాణ్ కావొచ్చేమో.. నాకు మాత్రం పీకే అంటే పిచ్చి కుక్కే. కరోనా వైరస్కైనా మందు కనిపెట్టారేమోగానీ.. ఈ పీకే లాంటి పిచ్చికుక్కల్ని నివారించడానికి మందు రాలేదింకా'' అంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ పై జనసేన పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. జోగికి వ్యతిరేకంగా జనసైనికులు మంగళవారం పలు చోట్ల ఆందోళనలు చేశారు.
పీకే అంటే పవన్ కాదు పిచ్చి కుక్క.. వైఎస్ భారతి జోలికొస్తే దేహశుద్ధే.. ఇంటికొచ్చి తోకలు కత్తిరిస్తాం
సైనికుల మండిపాటు
పవన్ కల్యాణ్ పై కారుకూతలు కూసిన పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ పై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడలో జనసైనికులు తలపెట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. వేలాదిగా జనసైనికులు బెంజి సర్కిల్ ను చుట్టుముడతారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు, నేతలు ఎక్కడిక్కడ వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్, ఎమ్మెల్యే జోగికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొన్ని చోట్ల జనసైనికులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పదుల సంఖ్యలో జనసైనికుల్ని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై జనసేన అధికార ప్రతినిధి అజయ్ వర్మ మీడియాతో మాట్లాడారు.
జగన్ ను ఏమైనా అనగలం..
‘‘మా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన కామెంట్లను ఖండిస్తున్నాం. రాజకీయాల్లో ఇంత దిగజారుడుతనం పనికిరాదు. అధికార మదంతో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వాళ్ల మదం అణిచేసే సత్తా జనసేనకు ఉంది. పవన్ ను పిచ్చి కుక్క అంటే జగన్ ను ఇంకో జంతువుతో పోల్చుతూ ఏమైనా అనగలం. కానీ అలాంటి సంస్కృని జనసేనాని మాకు నేర్పించలేదు''అని అజయ్ వర్మ అన్నారు.
Recommended Video
జోగి బతుకు ఎవరికి తెలియదు?
జోగి రమేశ్ వ్యాఖ్యలపై నిరసన తెలిపే హక్కు జనసేనకు ఉందని, అలాంటి హక్కును పోలీసులు అడ్డుకోవడమేంటని అజయ్ వర్మ ప్రశ్నించారు. పోలీసులు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుండటం దురదృష్టకరమన్నారు. ‘‘జోగి రమేశ్ బతుకేంటో, ఆయన అవినీతి చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసు. పవన్ పై మాట్లాడేముందు మీ నాయకుడు జగన్ గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. పవన్ ఏనాడూ అవినీతి చేసి జగన్ లాగా జైలు పాలు కాలేదు. వైసీపీ లాగా ఓట్లు కొనుక్కొని గెలవలేదు. జనసేనానిపై ఎవరైనా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోబోము.. కుక్క కాటుకు చెప్పుదెబ్బలాంటి సమాధానమిస్తాం''అని అజయ్ వర్మ హెచ్చరించారు.
బాబు అవినీతిపై బీజేపీ, జనసేన పోరాటం..
మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలనే డిమాండ్ తో బీజేపీ, జనసేన నేతలు ఉమ్మడిగా దీక్షలకు దిగారు. చిత్తూరు సిటీలో ఈ మేరకు రెండు పార్టీలు కలిసి చేపట్టిన దీక్షలో బీజేపీ రాష్ట్ర నేత గోళ్లహరిప్రసాద్ చౌదరి, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి దయారాం తదితరులు పాల్గొన్నారు.
జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు..
చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో ఐటీ దాడులు, రూ.2వేల కోట్ల అక్రమాస్తుల గుర్తింపు వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తున్నక్రమంలో సోమవారం ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను పిచ్చి కుక్కతో పోల్చడంతోపాటు టీడీపీ నేతలపైనా రమేశ్ ఫైరయ్యారు. బుద్ధి లేని లొల్లి వెంకన్న.. ఇంకొకరు సొల్లు ఉమ.. మెదడులేని మేధావి యనమల రామకృష్ణుడు.. అచ్చోసిన ఆంబోతు అచ్చెంనాయుడు.. లోకజ్ఞానం లేని నారా లోకేశ్.. బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి.. అంటూ టీడీపీ నేతలను విమర్శించారు.