జనసేన కీలక నిర్ణయం, వచ్చే ఎన్నికల్లో పొత్తు: త్వరలో ఉమ్మడి అజెండా
Recommended Video
హైదరాబాద్/అమరావతి: వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేయాలని జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో వామపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో పోటీ, పొత్తుపై కూడా చర్చించారు.
ఈ భేటీలో 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయి. వారం రోజులలో విజయవాడలో జనసేన, లెఫ్ట్ పార్టీల ప్రత్యేక సదస్సు జరగనుంది. భూసేకరణ, ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్రజా సమస్యలు, పరిష్కారం అజెండాను ఖరారు చేయనున్నారు. వీరు ఉమ్మడి అజెండాతో ముందుకు సాగనున్నారు.
వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. అప్పటి నుంచి పవన్ లెఫ్ట్ పార్టీలతో దోస్తీ చేస్తున్నారు. చాలా రోజులుగా చర్చలు సాగుతున్నాయి. లెఫ్ట్ పార్టీలతో వెళ్లేందుకు తాను సిద్ధమని పవన్, జనసేనతో తాము కలిసి నడుస్తామని లెఫ్ట్ పార్టీలు పలుమార్లు చెప్పాయి. ఇప్పుడు జనసేన నిర్ణయించింది.
లెఫ్ట్ పార్టీ నేతలు పలుమార్లు పవన్ కళ్యాణ్తో భేటీ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్రజా సమస్యలతో పాటు పొత్తు అంశంపై కూడా ఆయా భేటీలలో చర్చించారు.
కొద్ది రోజుల క్రితం సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. జనసేనతో కలసి సీపీఐ, సీపీఎంలు థర్డ్ ఫ్రంట్గా ఏర్పడతాయని చెప్పారు. అప్పటికే జనసేన, సీపీఐ, సీపీఎంలు పలు ప్రజా సమస్యలపై కలసికట్టుగా పోరాడుతున్నాయి. తనలో కాస్త వామపక్ష భావజాలం ఉందని పవన్ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం జనసేన పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.