నారాయణా! నీది చెప్పు, కేఈ కొడుకు గురించి అందరికీ తెలుసు, ఢిల్లీ వాళ్లకు లోకేష్ గురించి: ఏకేసిన జనసేన
అమరావతి: ఏపీ మంత్రులపై జనసేన పార్టీ బుధవారం సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికే మంత్రి నారా లోకేష్పై విమర్శలు గుప్పించిన ఆ పార్టీ మంత్రులు నారాయణ, జవహర్, కేఈ కృష్ణమూర్తి తనయుడు, పత్తిపాటి పుల్లారావు, అయ్యన్న పాత్రుడు తదితరులపై విమర్శలు గుప్పించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ మాట్లాడారు. ప్రభుత్వం అవినీతి గురించి పవన్ కళ్యాణ్ నాలుగేళ్లుగా చంద్రబాబుకు చెబుతూనే ఉన్నారని చెప్పారు.
చదవండి: షాకింగ్: 'జనసేనతో టచ్లో 40మంది టీడీపీ నేతలు, బాబుకు తెలుసు, లోకేష్ అవినీతిపై పవన్ వద్ద ఆధారాలు'
ఇప్పుడు ఆయన బయటకు మాట్లాడారని చెప్పారు. పవన్ లేవనెత్తడం వల్లే పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వచ్చిందన్నారు. వైసీపీ, టీడీపీలు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రం కోసం 25 మంది ఎంపీలు ఒకేతాటిపైకి ఎందుకు రావడం లేదన్నారు. జనసేన ఒక్కటే ఆంధ్రుల కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తోందన్నారు.
చదవండి: 'మోడీ ఇంత ద్రోహం చేస్తారనుకోలేదు, మాట్లాడవచ్చు కదా, బీజేపీకి అనుకూలంగా
నారాయణ! ఫస్ట్ నీ గురించి చెప్పు
నారాయణ విద్యా సంస్థలు ఫీజుల విషయంలో కాపీ రైట్స్ను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. అలాగే మంత్రి నారాయణ జనసేనానిపై విమర్శలు చేసేముందు ముందు తన శాఖలోని వైఫల్యాల గురించి చెప్పుకుంటే మంచిదన్నారు. ప్రొహిబిషన్ కమిటీని ఇప్పటి వరకు ఎందుకు వేయలేదో మంత్రి జవహర్ చెప్పాలన్నారు.
కేఈ కొడుకు వ్యవహారాలు అందరికీ తెలుసు
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడిపై హత్య కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. పవన్ పైన కేఈ వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. ఆయన కుమారుడి వ్యవహారాలు ఎవరికీ తెలియనివి కావన్నారు. అగ్రిగోల్డ్ కేసులో ఆరోపణలపై పత్తిపాటి పుల్లారావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అయ్యన్నా! నీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకో
విశాఖ, హైదరాబాదులలో తన కుమారుడు ఏయే పనులు చేస్తున్నారో అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలన్నారు. గుంటూరు అతిసార బాధితుల గోడును పవన్ చెప్పిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. తమకు ప్రజలే డైరెక్టర్లు అని తేల్చి చెప్పారు. వారి దారిలోనే వెళ్తామన్నారు.
ఢిల్లీ వాళ్లకు లోకేష్ వ్యవహారాలు తెలుసా
మంత్రి నారా లోకేష్ పైన తాము ఆరోపణలు చేస్తే ఢిల్లీ వాళ్లు ఇచ్చారా అని మంత్రి నారాయణ, టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, అంటే అక్కడి వారికి అతని వ్యవహారాలు అన్నీ తెలుసా అని శ్రీధర్ ప్రశ్నించారు. ఆయన వ్యవహారాలపై ఆ స్థాయిలోనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఏ పార్టీ దూరం కాదు, ఏ పార్టీ దగ్గర కాదు
పవన్ కళ్యాణ్ గుంటూరు సభలో లేవనెత్తిన సమస్యలపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని హితవు పలికారు. తమకు ఏ పార్టీ దూరం కాదని, అలాగే ఏ పార్టీ దగ్గర కాదన్నారు. పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్య లేవనెత్తిన తర్వాతనే మంత్రులు అక్కడకు వెళ్లారని చెప్పారు.