జగన్ సర్కార్పై పవన్ కల్యాణ్ మరో ఉద్యమం: రాజకీయ వ్యవహారాల కమిటీలో తీర్మానం
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన మరో ఉద్యమాన్ని ప్రారంభించబోతోంది. రైతాంగ సమస్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో పోరాడుతోన్న జనసేన.. వాటినే కేంద్రబిందువుగా చేసుకుని, కొత్త వ్యూహాలను రూపొందిస్తోంది. తాము ప్రతిపాదించిన డిమాండ్లకు అనుగుణంగా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలను చేపట్టట్లేదని భావిస్తోంది. ఈ నెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పోరుబాట పట్టాలని నిర్ణయించుకుంది.
కర్ణాటక శాసన మండలి బాహాబాహీ: డిప్యూటీ ఛైర్మన్ను లాగేసిన సభ్యులు: బలవంతంగా బయటికి
ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో తీర్మానం చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వాన్ని వహిస్తోందని, దీనికి నిరసనగా ఈ నెల 28వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు, బైఠాయింపులు చేపట్టాలని నిర్ణయించినట్లు పార్టీ పేర్కొంది. జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇందులో పాల్గొంటారని తెలిపింది. తమ నిరసనను తెలియజేసేలా.. అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను అందజేస్తామని తెలిపింది.
నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు 35 వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలనేది పవన్ కల్యాణ్ డిమాండ్. తక్షణ సాయంగా 10 వేల రూపాయలను అందజేయాలనే డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచారు. దీనిపై జగన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సకాలంలో పంట ఇన్పుట్ సబ్సిడీ, నివర్ తుఫాన్ నష్ట పరిహారాన్ని అందించకపోతే.. దానికి అర్థం ఉండదని పవన్ కల్యాణ్ విమర్శించారు. నివర్ తుఫాన్ నష్టంపై తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ ఒకరోజు దీక్ష కూడా చేపట్టారు జనసేన పార్టీ నేతలు.
దీనికి కొనసాగింపుగా తాజాగా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు జనసేన తెలిపింది. 28వ తేదీన కలెక్టర్లకు వినతిపత్రాలను ఇవ్వాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చింది. ఇందులో పవన్ కల్యాణ్ స్వయంగా పాల్గొంటారని తెలిపింది. ఆయన ఏ జిల్లాలో నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటారనేది ఇంకా తెలియరాలేదు. నివర్ తుఫాన్ ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన చిత్తూరు లేదా నెల్లూరు జిల్లాల్లో చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జనసేన డిమాండ్ చేస్తోంది.