బాబూ! అందుకే ఎదురుతిరిగా, బాత్రూం డబ్బు కూడానా, గంటా శ్రీనివాస్ వెనుకాడుతున్నారు: పవన్
పాయకరావుపేట: 2019 ఎన్నికల్లో పాయకరావుపేట సీటు జనసేనా ఖాతాలో పడటం ఖాయమని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అన్నారు. ఆయన పాయకరావు పేట బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గురజాడ పుట్టిన గడ్డ పైన ప్రభుత్వ కాలేజీ లేకపోవడం దారుణం అన్నారు.
నిత్య పెళ్లికొడుకు: పవన్పై 'సీఎం' తీవ్రవ్యాఖ్యలు, 'బెడ్రూంలో కూర్చోబెట్టి మాట్లాడటం వెనుక..'
ఇక్కడి ఆసుపత్రిని 30 పడకల నుంచి 60 పడకలు చేస్తామని చెప్పారని, కానీ ఎక్కడ చేశారని ప్రశ్నించారు. తాండవ నది నుంచి అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారని చెప్పారు. అవినీతి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారని, ఇంత జరుగుతుంటే అవినీతి ఎక్కడ అంటే ఇంకేం చెప్పాలన్నారు.
నాకు పూర్తి మెజార్టీ వస్తే, నాతో ప్రచారం ఎందుకు చేయించారు
అల్లూరి సీతారామారాజు తిరిగిన నేల ఇది అని పవన్ కళ్యాణ్ అన్నారు. కళింగాంధ్రను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయన్నారు. వేల ఎకరాలు దోపిడీ చేస్తున్నారు తప్ప, ఒక్క ఉద్యోగం ఇవ్వడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్కు ఉద్యోగం వచ్చింది తప్ప సామాన్యులకు రాలేదన్నారు. తనకు పూర్తి మెజార్టీ వస్తే ప్రజలకు ఏం కావాలో అవి చేయగలనని పవన్ చెప్పారు. 2014లో వారు తమతో ప్రచారం ఎందుకు చేయించుకున్నారని ప్రశ్నించారు.
ఏం అడిగే వారు లేరనేనా
ఏపీ అభివృద్ధి కోసం ఓట్లు చీలుతాయని చెప్పి తాను పోటీకి పెట్టలేదని పవన్ చెప్పారు. కానీ ఈ రోజు వరకు పాయకరావుపేటలో ఓ డిగ్రీ కళాశాల స్థాపించలేకపోయారన్నారు. నేను శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట నుంచి వచ్చానని, తనకు తెలిసిందేమిటంటే ఆసుపత్రి ప్రతిచోట కావాలని అర్థమైందన్నారు. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉండాలన్నారు. పాయకరావుపేట ఆసుపత్రిని 60పడకలుగా చేస్తానని చెప్పిన టీడీపీ చేయలేదని, అడిగేవారు లేక నిర్లక్ష్యం చేసిందని పవన్ అన్నారు. ఏ సమస్య పైన అయినా అధ్యయనం చేసి, అర్థం చేసుకుంటనే పరిష్కరిస్తామనే జనసేన పెట్టానని చెప్పారు. 2019లో పాయకరావుపేట జనసేనదే అవుతుందని కచ్చితంగా చెప్తున్నానని అన్నారు. 2019లో అసెంబ్లీ సీటుదే జనసేన మొట్టమొదటిసారిగా కైవసం చేసుకుంటుందన్నారు. ఇది గురజాడ పెరిగిన ప్రాంతమని, గురజాడ పుట్టిన ప్రాంతమని, ఆయన స్ఫూర్తితో ఈ ప్రాంతాన్ని చదువులమయం చేస్తానని హామీ ఇచ్చారు.
చంద్రబాబు అడుగుతున్నారు కానీ
స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే టెక్నికల్ కోర్సులు కావాలని పవన్ అన్నారు. జనసేన వస్తే మీకు అండగా ఉండే పార్టీ అన్నారు. కబ్జాలు ఎక్కడున్నాయో చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగుతున్నారని మండిపడ్డారు. మీరు నదులను, తాండవ నదిని కూడా కబ్జా చేశారని, నదీ ప్రవాహాన్ని పెంచాల్సింది పోయి తగ్గిస్తున్నారన్నారు. ఎందుకంటే అడిగేవాళ్లు లేరన్నారు. వరదలు వచ్చినప్పుడు నీరు కొట్టుకొని వస్తుందని, కరకట్టలు కట్టే పరిస్థితుల్లో లేరన్నారు. కరకట్టలపై హామీలే తప్ప నెరవేర్చింది లేదన్నారు. ఇసుక దోపిడీ ఉందన్నారు.
యువతను రాజకీయాలకే తప్ప చేసిందేమిటి?
2007లో ఇక్కడ ఓ కంపెనీ పెట్టి 1200 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, కేవలం హమాలీలుగా, కాంట్రాక్టు పద్ధతిలో కొన్నింటిని ఇచ్చారని పవన్ మండిపడ్డారు. వాటిపై ఏం చేశారని ప్రశ్నించారు. కళింగాంధ్రను ప్రభుత్వాలు వాడుకోవడమే తప్ప సాగునీరు, కరకట్టలు, ఆనకట్టలు, ప్రాజెక్టులు ఇవ్వడం లేదన్నారు. అందరూ మాట్లాడుతున్నారు తప్ప చేసేవారు లేరన్నారు. మాట్లాడితే విశాఖ కారిడార్ అంటూ వేలాది ఎకరాలు దోచేయడమే తప్ప ఉద్యోగాలు ఇచ్చారా అని నిలదీశారు. ప్రతి రాజకీయ పార్టీ యువతను ఓట్ల కోసం ఉపయోగించుకోవడం తప్ప వారికి ఉపాధి కల్పించింది లేదన్నారు.
పవన్ ఎందుకు ఎదురు తిరాగని అడుగుతున్నారు
చంద్రబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తనకు సడన్గా ఎదురుతిరిగారని చెబుతున్నారని, కానీ నేను మొదటి రోజు నుంచి ఒకటే చెబుతున్నానని.. మీరు హోదాపై ఎన్నోసార్లు మాటలు మార్చారన్నారు. 15 ఏళ్లు హోదా కావాలని, ఆ తర్వాత ప్యాకేజీ అని ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నారన్నారు. హోదాపై ఎన్నోసార్లు మాట మార్చిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. నేను ఎక్కడకు వెళ్లినా ఒకటే చెబుతున్నానని అన్నారు. నేను కాకినాడ, తిరుపతి, అనంతపురంతో పాటు జనసేన గళమెత్తినప్పుడల్లా హోదా అన్నామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేద్దామని, ముందుకు దూసుకెళ్దామని నేను చెబితే, ప్రతిసారి పోరాటం చేయనీయకుండా చేశారని మండిపడ్డారు. ఇంట్లోనే కూర్చోబెట్టి బయటకు వెళ్దామంటే నీరుగార్చే పరిస్థితి తెచ్చారన్నారు. అందుకే విసిగిపోయి ఎన్నోసార్లు చెప్పి చూశానని వ్యాఖ్యానించారు. కనీసం చంద్రబాబు హోదా కోసం పోరాటం చేయకపోయినా, ఇసుకను తవ్వుకొని కబ్జాలు చేసే పరిస్థితికి టీడీపీ వచ్చిందన్నారు.
బాత్రూం డబ్బులు కూడా దోచేశారు
బాత్రూంలు కట్టడం కోసం కేంద్రం పంపించిన నిధులను కూడా టీడీపీ నేతలు దోచేశారని పవన్ మండిపడ్డారు. ఒక్క విజయనగరంలోనే బాత్రూంలు కట్టాల్సిన రూ.300 కేంద్రం నిధులను దోచేశారన్నారు. ఈ టీడీపీ నాయకులు ఎంతగా దిగజారారంటే ఆఖరుకు బాత్రూంలు, లావెట్రీన్లు కూడా అమ్ముకోవడానికి తీసుకెళ్ళే పరిస్థితి ఉందన్నారు. ఇక్కడ కాలుష్య నియంత్రణ మండలి నియమాలు పాటించకుండా మత్స్యకారులకు కూడా అన్యాయం చేస్తున్నారన్నారు. నేను ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా వారి ఆవేదన తనకు తెలుసునన్నారు. కాంట్రిబ్యూటీ పెన్షన్ స్కీం (సీపీ) రాష్ట్ర పరిధిలో ఉంటే కనుక తాము అధికారంలోకి వస్తే దానిని పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. కేంద్రం పరిధిలో ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేయించే ప్రయత్నాలు చేస్తానన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మత్స్యకారులకు, యువతను ఆదుకుంటామన్నారు. ఆర్థికంగావెనుకబడిన వారికి హాస్టల్స్ పెడతామని చెప్పారు. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి హాస్టర్స్, గిరిజనుల హాస్టల్స్లో నాణ్యత పెంచడంచేస్తామని చెప్పారు. నాకు ఇంత ఆదరణ ఇచ్చిన అందరికీ ఆండగా ఉండానని చెబుతూ సెలవు తీసుకున్నారు.
గంటా శ్రీనివాస రావు వెనుకాడుతున్నారు
చంద్రబాబుకు అమరావతి అభివృద్ధి తప్ప పాయకరావుపేట అభివృద్ధి అవసరం లేదని పవన్ మండిపడ్డారు. అమరావతిలో యూనివర్సిటీలకు దారాదత్తం చేశారని, కానీ పాయకరావుపేటలో ఒక్క డిగ్రీ కళాశాల ఇచ్చేందుకు ఆ గంటా శ్రీనివాస రావు, మిగతా టీడీపీ నేతలు వెనుకాడుతున్నారన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటారు కానీ పాయకరావుపేటలో ఆసుపత్రిని అరవై పడకలకు మార్చకపోవడం మీ చేతగానితనం అన్నారు. కాగా, అంతకుముందు ఇటీవల ఫ్లెక్సీలు కడుతు చనిపోయిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని పవన్ ప్రకటించారు. చనిపోయిన కార్యకర్తల పిల్లల చదువును పార్టీ చూసుకుంటుందని చెప్పారు.