పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన సమయం వచ్చింది: జనసేన కార్యకర్తలు
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం తలపెట్టిన తిరుపతిలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలని జనసేన పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించే సమయం ఆసన్నమైందని అన్నారు.
కాంగ్రెస్ కార్యకర్త మునికోటి మృతికి నిరసనగా సోమవారం బంద్ పాటిస్తున్నారు. ఈ బంద్కు అన్ని వైపుల నుంచి మద్దతు వస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్ కల్యాణ్ రావాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ మునికోటి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తిరుపతి బంద్కు కాంగ్రెస్పార్టీ పిలుపు ఇచ్చింది.
ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కాంగ్రెస్, వామపక్షాల కార్యకర్తలు ఆందోళన చేశారు. తిరుమలకు వెళ్లే బస్సులను సైతం కార్యకర్తలు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రత్యేక హోదా డిమాండుతో ఆందోళనలు సాగాయి.
ఇదిలావుంటే, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ధర్నా చేశారు. నగరంలోని గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మునికోటి మృతికి సంతాపంగా ర్యాలీ జరిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఆందోళనలు జరిగాయి. ప్రత్యేక హోదా కోసం యూత్కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో భారీ ర్యాలీ జరిపారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు సీపీఐ విశాఖ నగరంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించింది.