రాపాక ఎక్కడ?: ముఖం చాటేశారా? ఇంత జరుగుతున్నా కనిపించట్లేదంటూ..జనసైనికుల నిప్పులు..!
కాకినాడ: రాపాక వరప్రసాద్. ఇప్పుడు జనసేన పార్టీలో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే నాయకుడు. ఏకైక శాసన సభ్యుడు. ఈ సారి కూడా ఆయన జనసేన పార్టీలో చర్చనీయాంశమే అయ్యారు. దీనికి ప్రధాన కారణం- జన సైనికులు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్షలకు రాపాక వరప్రసాద్ ఉద్దేశపూరకంగానే డుమ్మా కొట్టారంటూ ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ ఆయన బయటికి రావట్లేదంటూ మండిపడుతున్నారు.
Vizag: అందరి కళ్లూ విశాఖ వైపే: అప్పుడే మొదలెట్టేశారు: హాట్ కేకుల్లా.. !
కాకినాడ ఘర్షణల్లో..
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాకినాడ సిటీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై చేసిన ఘాటు వ్యాఖ్యలకు నిరసనగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టిన విషయం తెలిసిందే. కాకినాడలోని భానుగుడి సెంటర్ వద్ద చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనల సందర్భంగా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. డాక్టర్ పంచకర్ల సందీప్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
రాపాక గైర్హాజర్..
తూర్పు గోదావరి జిల్లా కేంద్రంలో ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పటికీ.. పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అందుబాటులో లేకుండా పోయారని అంటున్నారు నాయకులు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న రాజోలు.. తూర్పు గోదావరి జిల్లాలోనే ఉందనే విషయాన్ని రాపాక విస్మరించరాని మండిపడుతున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంత ఘాటుగా వ్యాఖ్యానించినప్పటికీ.. రాపాకకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని ఆరోపిస్తున్నారు.
రాజీనామా కోసం డిమాండ్..
జనసేన పార్టీ తరఫున శాసన సభకు ఎన్నికైన రాపాక వరప్రసాద్.. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతీ నిర్ణయాన్నీ ఆయన సమర్థిస్తున్నారని విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పట్ల అంతగా అభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేసి, ఆ పార్టీలో చేరిపోవాలని డిమాండ్ చేస్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు. రాజోలు నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు కూడా తమ ప్రదర్శనల్లో పాల్గొన్నప్పటికీ.. రాపాక హాజరు కాలేదంటూ ఆరోపిస్తున్నారు.
జనసేన పార్టీ నాయకులపై కేసులు..
ఇదిలావుండగా- భానుగుడి సెంటర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. పోలీసులు జనసేన పార్టీకి చెందిన పలువురిపై కేసులు నమోదు చేశారు. కొందరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినప్పటికీ.. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు దాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. తాను నేరుగా కాకినాడకు వస్తానంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో కాకినాడలో నెలకొన్న పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు లేకపోలేదు.