జానకిరాం చితికి నిప్పంటించిన చిన్నారి ఎన్టీఆర్, ఢిల్లీలో బాబు
హైదరాబాద్: జానకిరాం అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం ముగిశాయి. మొయినాబాద్లోని ముర్తూజగూడలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. జానకిరాం తనయుడు చిన్నారి తారక రామారావు చితికి నిప్పంటించారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు.
నందమూరి కుటుంబ సభ్యులతో పాటు మంత్రి పరిటాల సునీత, ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని, అభిమానులు తదితరులు హాజరయ్యారు.
వైద్యుల ప్రాథమిక నివేదిక
జానకిరాం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యులు ఆ నివేదిక ప్రాథమిక వివరాలను ఆదివారం ఉదయం వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో జానకిరాం తల, ఛాతి, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయన్నారు. కుడి చేయి, కుడికాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పక్కటెముకలు విరిగి రక్త సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. దీంతో ఆయన మృతి చెందినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అల్లుడు నందమూరి జానకిరాం అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకిరాం మృతి చెందిన విషయం తెలిసిందే.
అయితే, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆదివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలోని ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కారణంగా ఆయన గైర్హాజరయ్యారు.