చంద్రబాబుతో కాకుండా బీజేపీతో పవన్ దోస్తీ వెనుక పెద్ద వ్యూహమే .. అదేంటంటే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపు బీజేపీ మీద పడిందా ? బీజేపీతో కలిసి ముందుకు సాగాలని జనసేనాని నిర్ణయం తీసుకున్నారా ? ఇక తాజా పరిణామాలు, ఢిల్లీ లో జేపీ నడ్డాతో పవన్ భేటీ అంతర్యం కూడా అదేనా ? మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య టీడీపీకి సన్నిహితంగా ఉన్నారని టీడీపీతో పొట్టు పెట్టుకుంటారని అంతా ఊహిస్తే అలా కాకుండా బీజేపీతో కలిసి వెళ్ళాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి ? అన్నది ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
బీజేపీతో పవన్ దోస్తీ ఇందుకోసమే
గత ఎన్నికల్లో ఓటమి పాలైన జనసేన రాష్ట్రంలో తాజాగా రాజధాని విషయంలో నెలకొన్న తాజా పరిస్థితులతో ఒంటరిగా కంటే పొత్తులతో జంటగా అధికార పక్షంమీద పోరాటం సాగించాలని భావిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్న జనసేనాని బీజేపీతో కలిసి పనిచేసే విషయంలో బహిరంగ ప్రకటన చేయనప్పటికీ దాదాపు అలాంటి సంకేతాలను ఇచ్చేశారు. వైసీపీ సర్కార్ తీసుకునే నిర్ణయాలను కట్టడి చేసే శక్తి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని భావిస్తున్న పవన్ కేంద్రంలోని అధికార పార్టీ అయిన బీజేపీతో దోస్తీకి సిద్ధం అయ్యారు.
జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసే ఛాన్స్ .. అందుకే బీజేపీతో
జనవరి 20 తర్వాత ఏ క్షణమైనా ఏపీకి మూడు రాజధానులంటూ జగన్ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక అతి త్వరలోనే విశాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో అదే సందర్భంలో జగన్ తీసుకునే నిర్ణయానికి చెక్ పెట్టాలన్నా, ఏదైనా ప్రజల కోసం చెయ్యాలన్నా బీజేపీతో కలిసి నడిస్తే కాస్త ప్రయోజనకరంగా ఉంటుందని జనసేనాని భావిస్తున్నారు.
బీజేపీతో కలిసి ప్రత్యక్ష పోరాటంలోకి దిగనున్న జనసేన
ఇక ఇప్పటి వరకు రాజధాని రైతులకు మద్దతు తెలపటం మినహాయించి ప్రత్యక్ష పోరాటంలోకి అటు బీజేపీ, ఇటు జనసేన పూర్తిగా దిగలేదు. ఇక ఈ నేపధ్యంలో బీజేపీతో కలిసి జనసేన కూడా ఉద్యమించేందుకు కార్యాచరణ జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీతో జత కడితే రెండు పార్టీల క్యాడర్ రోడ్డెక్కి ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావచ్చు అన్నది తాత్కాలిక వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. రాజధాని ఉద్యమ ఊపుతోనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొవాలన్నది జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహమని చెబుతున్నారు.
కలిసి సాగితే భవిష్యత్ లో జనసేనాని సీఎం గా .. పార్టీ శ్రేణుల ఆలోచన
స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ పార్టీ సత్తా ఎంతో రెండు పార్టీలకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఆగితే లాభం ఉంటుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటె బీజేపీకి ఎలాగో ముఖ్యమంత్రి స్థాయి చరిష్మా వున్న నేతలు లేరు. ఇక అక్కడ పవన్ కళ్యాణ్ కే ప్రాధాన్యత దక్కుతుంది. ఇక ఇప్పుడు ఏపీ పరిస్థితులను బట్టి చూసినా బీజేపీతో స్నేహమే జనసేనకు లాభిస్తుంది. ఇప్పటి నుండే బీజేపీ పొత్తులతో జనసేన కలిసి సాగితే 2024లో రెండు పార్టీలు హవా చూపిస్తాయి . ఏపీలో వైసీపీకి బీజేపీ-జనసేన కూటమే ప్రత్యామ్నాయం అవుతుంది అని పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే బీజేపీతో పొత్తు వ్యూహం అని భావిస్తున్నారు.