జనసేన తరుపున టీవీల్లో మాట్లాడేది వీళ్లే!...కీలక నిర్ణయం
జనసేన పార్టీ పరంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ తరుపున ఇక మీదట టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా కొందరిని ఎంపిక చేసింది. దిలీప్ సుంకర తిరుగుబాటుతో పార్టీలో చెలరేగిన అంతర్గత సంక్షోభం నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేప్టటింది.
టివీ చర్చల్లో పాల్గొనే ప్యానల్ వివరాలను జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్లు తెలుస్తోంది.
జనసేన పార్టీ తరుపున చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే వారి పేర్లు ఇవే...అద్దేపల్లి శ్రీధర్,పార్ధ సారధి,శివశంకర్,పి.హరి ప్రసాద్. వీరు మాత్రమే ఇక మీదట టివి ఛానెళ్లలో జనసేన తరుపున తమ వాదనలు వినిపిస్తారట. అందుకోసమే వీరికి పార్టీ సిద్దాంతాలు, విధివిధానాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే జపసేన తరుపున జిల్లా...నగర స్థాయిల్లో కూడా చర్చల్లో పాల్గొనేవారిని వారి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని, అతి త్వరలో వారి వివరాలు కూడా వెల్లడిస్తామని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు బి. మహేందర్ రెడ్డి ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
నిన్నమొన్నటివరకు జనసేన తరుపున వాదన బలంగా వినిపించిన కల్యాణ్ దిలీప్ సుంకర పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు, కుట్రల్ని సహించలేక బయటకు వెళుతున్నట్లు ప్రకటించడంతో కలకలం రేగిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతుంటే తనకు అవమానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన దిలీప్...ఈ డిబెట్లలో తానే స్వయంగా పాల్గొనలేదని, టీవీఛానళ్ల ఆహ్వానం మేరకు తాను పాల్గొన్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 93 డిబెట్లలో పాల్గొన్నా...పదేపదే జన సేన పార్టీతో దిలీప్ సుంకరకు సంబంధం లేదన్న స్టేట్మెంట్స్ ఇవ్వడం తనను బాధించిందని దిలీప్ చెప్పారు.