రైతుల పోరాటానికి అండగా నిలుస్తాం : జగన్ నాడే వ్యతిరేకించి ఉంటే..: నాగబాబు..మనోహర్ ప్రకటన..!
అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులకు జనసేన అండగా నిలుస్తుంది..పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలుస్తారని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. అన్ని ప్రాంతాలను డెవలప్ చేయటానికి తాము వ్యతిరేకం కాదని.. అమరావతిలో రైతులు నాటి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఎలా ఉల్లంఘిస్తారని ప్రశ్నించారు. అసలు కమిటీ అమరావతిలో పర్యటించకుండా.. భూములిచ్చిన రైతులతో సంప్రదింపులు చేయకుండా నివేదిక ఎలా ఇస్తుందని నిలదీసారు.
ఈ అంశాన్ని ప్రధానికి వివరిస్తామని జనసేన హామీ ఇచ్చింది. రాజధాని ఏర్పాటు సమయంలో మద్దతిచ్చి..ఇప్పుడు కమిటీ నివేదికను ముందుగానే ఎలా లీక్ చేస్తారని నిలదీసారు. జనసేన నేతలు నాగబాబబు..నాదెండ్ల మనోహర్ అక్కడి మహిళలు..స్థానికులతో కలిసి రోడ్డు పైన బైఠాయించారు. కమిటీ నివేదిక వచ్చే వరకూ ఎదురు చూడాలని..ఆ తరువాత ప్రభుత్వం రాజధానిలోని రైతులకు న్యాయం చేయాల్సిందేనని జనసేన నేతలు డిమాండ్ చేసారు.
పవన్ కళ్యాన్ మీకు అండగా నిలుస్తారు..
ముఖ్యమంత్రి ప్రకటనతో ఆందోళన చేస్తున్న అమరావతి ప్రాంత వాసులకు మద్దతుగా జనసేన నేతలు అక్కడకు తరలి వచ్చారు. వారితో కలిసి.. రోడ్డు పైన బైఠాయించారు. ముఖ్యమంత్రి అధికారుల నివేదిక రాకుండానే ముందుగా లీక్ చేసే విధంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. పార్టీ నేతలు నాగబాబు..మనోహర్ తో పాటుగా పలువురు నేతలు ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు.
స్థానికులు చేస్తున్న పోరాటంలో భాగస్వాములవుతామని హామీ ఇచ్చారు. రైతులు పెద్ద మనసుతో నాడు రాజధానికోసం భూములు ఇచ్చారని..వారిని అగౌరవ పరిచే విధంగా మాట్లాడటం మంత్రులకు సరి కాదని నాగబాబు.. మనోహర్ వ్యాఖ్యానించారు. అధికారం ఉంది కదా..అని ఇష్టానుసారం ..అభిప్రాయ సేకరణ లేకుండా ప్రకటన చేయటం సరి కాదని వ్యాఖ్యానించారు.
కమిటీ రైతులను ఎందుకు కలవలేదు..
జనసేన 13 జిల్లాలను డెవలప్ చేయాలని కోరుకుంటుందని స్పష్టం చేసారు. తాము వికేంద్రీకరణకు వ్యతిరేకం కాదని..రైతులను మాత్రం అన్యాయం చేస్తే సహించమని స్పష్టం చేసారు. అసలు జీఎన్ రావు కమిటీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో సంప్రదింపులు చేయకుండా..ఏ రకంగా నివేదిక అందిస్తుందని ప్రశ్నించారు.
కమిటీ నివేదికను బయట పెట్టి..అఖిల పక్షం నిర్వహించాలని డిమాండ్ చేసారు. అసలు..రాజధానికి భూములిచ్చి ఆందోళన చేస్తుంటే వారి కులాల ప్రస్తావన ఎందుకని నిలదీసారు. మంత్రులు బాధ్యత లేని ప్రకటనల ద్వారా రైతుల మనోభావాలు గాయపరిచే విధంగా వ్యవహరించటం సరి కాదని సూచించారు. మహిళలు రోడ్ల మీదకు వచ్చారంటే..అది ప్రభుత్వ వైఫల్యమని నాగబాబు వ్యాఖ్యానించారు. మహిళల ఉసురు పోసుకోవద్దని హెచ్చరించారు.
జగన్ నాడే వ్యతిరేకించి ఉంటే.. ఒప్పందం అమలు చేయాలి
ఇది ప్రజలకు..నేతలకు మధ్య జరిగిన ఒప్పందం కాదని..రైతులకు..ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అని జనసేన నేతలు గుర్తు చేసారు. వారితో చేసుకున్న ఒప్పందాన్ని....అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అమలు చేయాల్సి ఉందని స్పష్టం చేసారు. అవగాహన లేకుండా పాలన చేస్తున్నారని మండిపడ్డారు.
నాడు ప్రతిపక్ష నేతగా జగన్ రాజధానికి మద్దతు ప్రకటించారని..ఆ రోజే జగన్ వ్యతిరేకించి ఉంటే తాము భూములు ఇచ్చే విషయం పైన ఆలోచన చేసి ఉండేవారిమని రైతులు జనసేన నేతలకు వివరించారు. రాజధాని భూముల్లో అవకతవకలు జరిగి ఉంటే తప్పులు చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని.. రైతులను ఇబ్బంది పెట్టటం సరి కాదని స్పష్టం చేసారు. అధికారంలో ఎవరు ఉన్నా..ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని జనసేన నేతలు డిమాండ్ చేసారు.