కానరాని నాయకత్వం, ఆపై బీజేపీతో పొత్తు- నానాటికీ తీసికట్టుగా జనసేన...
ఏపీలో 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత జనసేన కాస్తో కూస్తో ప్రభావం చూపుతుందని ఆశించిన నేతలకు నిరాశ తప్పడం లేదు. పార్టీని నమ్ముకుని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టుకున్నా అధినేత వైఖరితో తమ భవిష్యత్ పై భరోసా లేని పరిస్ధితి ఉందని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో పొత్తు తర్వాత తమ పరిస్ధితి మరింత దారుణంగా తయారైందని వారు చెబుతున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే జనసేన కూడా ప్రజారాజ్యం బాటలో సాగక తప్పదనే ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో జనసేన..
ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేకుండానే కమ్యూనిస్టులతో కలిసి బరిలోకి దిగిన జనసేన.. ఒకే ఒక్క సీటులో గెలుపుతో సరిపెట్టుకుంది. స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమిపాలయ్యారు. టీడీపీ-జనసేన ఒకటేనన్న ప్రచారంతో పాటు పవన్ తీరుపై ప్రజల్లో నమ్మకం కుదరకపోవడంతో జనసేన దారుణ ఫలితాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా పవన్ పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టలేదు. ఎన్నికలు పూర్తి కాగానే వైసీపీ ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించారు. దీంతో పార్టీలో కాస్తో కూస్తో పేరున్న నేతలంతా జనసేను వీడిపోయారు.
అక్కడక్కడా మెరుపులు...
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో ఏర్పడిన తీవ్ర ఇసుక కొరతపై జనసేనాని విశాఖ వేదికగా ఉద్యమించారు. అప్పటికి ఇంకా విశాఖపట్నాన్ని ప్రభుత్వం రాజధానిగా ప్రకటించలేదు. అయితే విశాఖలో ఇసుక కొరతపై పవన్ చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతమైంది. ఆ తర్వాత చంద్రబాబు చేపట్టిన ఇసుకదీక్షకు అదే ప్రేరణగా నిలిచింది. కానీ ఆ తర్వాత మళ్లీ పవన్ సమావేశాలకే పరిమితమయ్యారు. పార్టీని పటిష్టం చేయాలంటే భారీగా ఆర్దిక వనరులతో పాటు నేతలకు పదవులు తప్పనిసరి. కానీ అసెంబ్లీ పోరులో ఓటమి తర్వాత కుదేలైన జనసేనకు అది చాలా కష్టం.. కాబట్టి పవన్ కూడా ఎలాంటి హామీలు ఇవ్వలేని పరిస్ధితి. ఆ తర్వాత కర్నూలులో మూడేళ్ల క్రితం అత్యాచారం, హత్యకు గురైన ప్రీతి సుగాలి కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆమె తల్లితండ్రులతో కలిసి పవన్ చేపట్టిన పోరాటం కూడా విజయవంతమైంది. కానీ దాన్ని కూడా సద్వినియోగం చేసుకునే పరిస్దితి జనసేనకు లేదు.
బీజేపీతో పొత్తు ప్రభావం..
కర్నూలులో ప్రీతి సుగాలి హత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ తో దీక్ష చేపట్టక ముందే పవన్ ఢిల్ల్లీలో బీజేపీ పెద్దలను కలిసి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన... ఏ రోజూ ఆ పార్టీతో కలిసి ఉమ్మడి పోరాటాలు మాత్రం చేయలేదు. దానికి కారణంం పార్టీలో కాస్తో కూస్తో ఉన్న మైనార్టీ కార్యకర్తలే. బీజేపీతో పొత్తు కారణంగా వారు దూరమయ్యే పరిస్ధితి రావడంతో పవన్ ఆ పార్టీతో నేరుగా క్షేత్రస్ధాయిలో కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధపడలేదు. అయినా జనసేనాని వైఖరిని వారు నమ్మడం లేదని తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది.
Recommended Video
నాయకత్వ లేమే అసలు సమస్య...
అసెంబ్లీ ఎన్నికల ఓటమి, బీజేపీతో పొత్తు కంటే కూడా అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం, వ్యూహాల లేమి పార్టీపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. పవన్ నాయకత్వంపై నమ్మకం లేక ఇప్పటికే పలువురు కీలక నేతలు జనసేనను వీడిపోయారు. ప్రస్తుతం జనసేన పార్టీలో గమనిస్తే రాష్ట్ర స్ధాయిలో చెప్పుకోదగిన నేతలు ఎవరూ కనిపించడం లేదు. ఉన్నంతలో పవన్ తో కలిసి పర్యటనలు, ప్రెస్ మీట్లకు హాజరయ్యే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాత్రమే ఆయన వెంట కనిపిస్తున్నారు. ఆయన కూడా రేపోమాపో పార్టీని వీడి పోతారనే ప్రచారం సాగుతోంది. దీనికి తోడు బీజేపీ నేతలతో పొత్తు తర్వాత అమరావతి వంటి కీలక సమస్యలపై స్వేచ్ఛగా పోరాటాలు చేసే వీలు లేకపోయిందని పవన్ అంతర్మథనం చెందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అటు క్యాడర్ కు భరోసా ఇవ్వలేక, ఇటు బీజేపీతో పొత్తు కారణంగా స్వేచ్ఛగా పోరాటాలు చేయలేక పవన్ సతమతం అవుతున్న పరిస్దితి కనిపిస్తోంది. స్ధానిక ఎన్నికల పోరు సందర్భంగా జిల్లాల్లో అభ్యర్దుల ఎంపికలో కానీ, ఇతర వ్యవహరాల్లో కానీ పవన్ ఆసక్తి చూపకపోవడాన్ని చూస్తే జనసేన కూడా ప్రజారాజ్యం బాటలో పయనిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.