కన్నీళ్లు కోపంగా.. కోపం ఉద్యమంగా, ప్రభుత్వాలే కూలిపోతాయి, ఒంగోలులో జనసేనాని ఫైర్
Recommended Video
ఒంగోలు: జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ శనివారం ఒంగోలులో ఫెర్రీఘాట్ పడవ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జనసేన వారికి అండగా ఉంటుందని అన్నారు.
విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద గత నెలలో జరిగిన పడవ బోల్తా ప్రమాదంలో ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు దుర్మరణంపాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద మృతుల్లో అత్యధికులు ప్రకాశం జిల్లాకు చెందిన వారే.
వస్తానని హామీ ఇచ్చారు.. వచ్చారు...
ఈ ప్రమాదం జరిగిన సమయంలో పవన్ విదేశాల్లో సినిమా చిత్రీకరణలో ఉండటంతో అప్పట్లో రాలేకపోయారు. ఆ సమయంలో మృతులకు సంతాపం తెలిపిన ఆయన తరువాత స్వయంగా వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాల సభ్యులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ శనివారం ఒంగోలుకు వచ్చారు. అక్కడి ఎన్టీఆర్ కళాక్షేత్రంలో పడవ ప్రమాద బాధితుల కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు.
ప్రతి ఒక్కరినీ పలకరించిన పవన్...
పవన్ తమను పరామర్శించేందుకు రావడంపై ఫెర్రీఘాట్ ప్రమాద మృతుల బాధిత కుటుంబాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరినీ పవన్ పరామర్శించారు. నిర్లక్ష్యం వల్లే పడవ ప్రమాదం జరిగిందని, హెచ్చరించినా వినకుండా బోటును లోపలికి తీసుకెళ్లారంటూ వారు ప్రమాదం జరిగిన తీరుపై ఆయనతో తమ ఆవేదన పంచుకున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఉంటే కొందరైనా బతికుండే వారంటూ పవన్కు మృతుల ఫొటోలు చూపిస్తూ కన్నీరుమున్నీరయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కదిలిస్తే చాలు.. కన్నీళ్లే...
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సరదాగా విహార యాత్రకు వెళ్లి మృత్యువాత పడడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎవరింట్లో అయినా ఓ మనిషి చనిపోతే ఆ బాధ వర్ణనాతీతమన్నారు. కదిలిస్తే చాలు ఒక్కో కుటుంబం కన్నీళ్లు కారుస్తోందంటూ పవన్ ఆవేదన చెందారు. ఎక్స్గ్రేషియాతో పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రమాదానికి కారణమైన వారికి శిక్ష పడాల్సిందేనన్నారు.
కారకులకు శిక్ష్ పడాల్సిందే...
తాను ప్రభుత్వాన్నో, అధికారులనో నిందించేందుకు ఇక్కడికి రాలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులకు సున్నితమైన మనస్తత్వం లేకుండా పోయిందని, ఏ ప్రమాదం జరిగినా ఎక్స్గ్రేషియా ప్రకటించేసి చేతులు దులుపుకోవడం సర్వసాధారణం అయిపోయిందంటూ విమర్శించారు. నిందితులు తప్పించుకుని తిరగడం అసలు సిసలైన విషాదమన్నారు. ప్రమాద కారకులకు శిక్ష పడడం కూడా ముఖ్యమేనన్నారు. ప్రమాద బాధితుల బాధను అందరూ అర్థం చేసుకోవాలని కోరారు.
మంత్రి స్వయంగా పరామర్శించాలి...
‘ఈ ప్రమాదం జరిగిన సమయంలో నేను విదేశాల్లో ఉన్నాను. అందుకే, వెంటనే రాలేకపోయాను.. క్షమించండి' అని బాధిత కుటుంబాలతో పవన్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఒక బాధ్యత అనేది ఉండాలని జనసేనాని వ్యాఖ్యానించారు. కన్నీళ్లు కోపంగా మారతాయని, ఆ కోపమే ఉద్యమాలకు దారితీస్తుంది.. ఆ ఉద్యమాల దెబ్బకు ప్రభుత్వాలే కూలిపోతాయని హెచ్చరించారు. ఇప్పటికైనా మంత్రి అఖిల ప్రియ స్వయంగా వచ్చి బాధితులను పరామర్శించాలని ఆయన అన్నారు.
జరిగాక కాదు.. జరగకుండా...
పాలకులు పవర్ పాలిటిక్స్లో మానవత్వాన్ని మంటగలిపేస్తున్నారని దుయ్యబట్టారు. లైఫ్ జాకెట్లు ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. ఇటువంటి ప్రమాదాలు మున్ముందు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో బాధితులను అడిగి తెలుసుకోవాలని జనసేనాని సూచించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ జరపడం కాదు, అసలు, ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు.