ఏలూరు విపత్తును ముందే గుర్తించా -మద్యం ఆదాయం రైతులకు -పవన్ కల్యాణ్ సరికొత్త ఉద్యమం
ఆంద్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లలోని ఏలూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు, దెందులూరులోనూ గుర్తు తెలియని వ్యాధి తీవ్ర భయాందోళనలు రేపుతున్నది. ఫిట్స్, వాంతులు వంటి లక్షణాలతో అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య సోమవారం నాటికి 425కు పెరిగింది. వ్యాధి తీవ్రతరం కావడంతో ఏలూరు విద్యానగర్ కు చెందిన శ్రీధర్(45)అనే వ్యక్తి ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. ఎందుకిలా జరుగుతోందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. రోగుల శాంపిళ్లను వైరాలజీ ల్యాబ్ కు పంపగా, వాటి ఫలితాలు వచ్చాకే కారణాలు బయటపడే అవకాశముంది. ఏలూరులో సేవల కోసం ఎయిమ్స్ నుంచి వైద్య నిపుణులు రంగంలోకి దిగారు. సీఎం జగన్ స్వయంగా అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించి, అవసరమైన చర్యలకు ఆదేశాలిచ్చారు. ఈ విపత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.
బీజేపీలోకి నటుడు రాజేంద్ర ప్రసాద్? -సోము వీర్రాజుతో భేటీ -నాడు చంద్రబాబుకు ముద్దు -జగన్పై రుసరుస
మిస్టరీ విపత్తును ముందే గుర్తించాం..
ఏలూరు నగరంలో అంతు చిక్కని వ్యాధితో 300 మందికి పైగా ఆసుపత్రుల్లో చేరడం దురదృష్టకరమని జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలీ వ్యాధి ఏమిటో తెలీక రోగులు, వారి కుటుంబీకులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఇటీవల కృష్ణా జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలోనే ఏలూరు మిస్టరీ అస్వస్థతల విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఏలూరులో సరైన వైద్య సదుపాయాలు లేక రోగుల్ని విజయవాడకు తీసుకొస్తున్నారన్న సంగతి తెలియగానే స్థానిక జనసేన నాయకుల్ని అప్రమత్తం చేశానని, బాధితులకు బాసటగా నిలవాలని జనసైనికుల్ని ఆదేశించానని పవన్ తెలిపారు..
రంగంలోకి జనసేన డాక్టర్లు..
ఏలూరు బాధితులకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉండాలన్న పవన్.. జనసేన పార్టీ తన వంతుగా ముగ్గురు వైద్య నిపుణులను ఏలూరుకు పంపుతున్నదని, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రజలు, బాధిత కుటుంబాలతో మాట్లాడి తగిన సలహాలను అందిస్తామని తెలిపారు. జనసేనలో క్రియాశీలకంగా పని చేస్తున్న ముగ్గురు వైద్య నిపుణుల బృందానికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నేతృత్వం వహిస్తారని జనసేనాని చెప్పారు. ఈ బృందం మంగళవారమే ఏలూరులో పర్యటిస్తుందన్నారు. ఏలూరు విపత్తుపై శ్రేణుల్ని పురమాయిస్తూనే మరో వైపు రైతు దీక్ష కొనసాగిస్తున్నారు పవన్ కల్యాణ్. దీనికి సంబంధించి తాజాగా మరో ప్రకటన చేశారు..
పరిహారంతోనే రైతులకు ఊపిరి..
ఏపీలో నివర్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం.. పెట్టుబడిగా రూ.50వేలు, నష్టపరిహారంగా రూ.35వేలు ఇస్తేనే రైతులు కాస్త ఊపిరి తీసుకుంటారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇదే డిమాండ్ నెరవేర్చాలని తామిచ్చిన 48 గంటల డెడ్ లైన్ ను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే సోమవారం నుంచి దీక్షకు దిగామని ఆయన గుర్తుచేశారు. నివర్ తుపాను కారణంగా ఏపీలోని నాలుగు జిల్లాల్లో దాదాపు 17లక్షల పైచిలుకు ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, అసలే కరోనాతో చితికిపోయిన రైతులకు ఈ ఏడాది వరుసగా మూడు ప్రకృతి విపత్తులు శాపంగా మారాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం విషయంలో..
మద్యం ఆదాయాన్ని రైతులకు..
రైతులకు నష్ట పరిహారం విషయంలో జగన్ సర్కారు ఇక ఏమాత్రం తాత్సారం చేయరాదని, కుంటిసాకులు అసలే చెప్పొద్దని పవన్ అన్నారు. ఏపీలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం తమ ప్రభుత్వానికి అవసరం లేదని వైసీపీ మేనిఫెస్టోలో స్పస్టంగా పేర్కొన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. అలాంటప్పుడు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనైనా.. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి సమకూరుతోన్న రూ.16,500కోట్ల ఆదాయాన్ని పంట నష్టపోయిన రైతులకు కేటాయించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అంతేకాదు..
పవన్ కల్యాణ్ కొత్త ఉద్యమం జైకిసాన్
సోమవారం నాటి రైతు దీక్షతోనే ‘జైకిసాన్' పేరిట సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టామని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ‘‘రైతులకు గిట్టుబాటు ధర కాదు.. లాభసాటి ధర రావాలన్నదే జనసేన ప్రయత్నం. దాని కోసమే ‘జైకిసాన్'కు శ్రీకారం చుట్టాం. ఇందులో భాగంగా రైతు సంఘాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో చర్చించి ఒక పాలసీని రూపొందించి, దాని ప్రాధాన్యత క్రమంలో ముందుకు వెళతాం. ఇవాళ్టి దీక్షతోనే ‘జైకిసాన్' మొదలైంది. పంట నష్టపోయిన రైతులకు అంతో ఇంతో పరిహారం అందుతున్నా.. కౌలు రైతులను మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. అన్ని రకాల రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం లోతైన ఆలోచన చేయాలి. ప్రతి జనసైనికుడు, నాయకులు, ప్రజలు.. అన్నదాతకు మద్దతు ప్రకటించాలి'' అని పవన్ పిలుపునిచ్చారు.
గ్రేటర్ గెలుపు: ఢిల్లీకి బండి సంజయ్ -కేంద్ర కేబినెట్లో చోటు? -బీజేపీ అధికారంలోకి రాగానే..