ఆనం - కోటంరెడ్డి ఎపిసోడ్ లో పవన్ కల్యాణ్ భారీ ట్విస్ట్..!!
ఆనం రామానారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇచ్చారు.
నెల్లూరు వైసీపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్. వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి.. పార్టీ అధినాయకత్వం చర్యల నడుమ జనసేన పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆనం రామనారాయణ రెడ్డి- కోటంరెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్ ఆ ఇద్దరికీ అనుకూలంగా కీలక ప్రకటన చేసారు. ప్రజా జీవితం సుదీర్ఘ రాజకీయ అనుభవం..హుందా అయిన రాజకీయ నాయకుడిగా ఆనంకు పేరుందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
అటువంటి సీనియర్ నేత తనకు ప్రాణ హాని ఉందని ఆందోళన వ్యక్తం చేయటం చూస్తుంటే రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శాసనసభ్యులే ప్రాణ హాని తో భయపడే పరిస్థితులు వచ్చాయని..మిగిలిన ప్రజా ప్రతినిధుల పరిస్థితి ఏంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
ఆనం-కోటంరెడ్డికి మద్దతుగా పవన్
ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యల ఫలితంగా ఆనం ఎమ్మెల్యేగా ఉన్నా..ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోకవర్గానికి నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని వైసీపీ అధినాయకత్వం ఇంఛార్జ్ గా నియమించింది. దీంతో..ఆనం తాజాగా ఫోన్ ట్యాపింగ్..తనకు భద్రత తగ్గించటం.. తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు కొనసాగింపుగా ఆనం ఈ వ్యాఖ్యలు చేసారు. ఆయన టీడీపీలో చేరుతారని జిల్లా రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేనాని పవన్ తనకు ఆనం కు మద్దతుగా రంగంలోకి దిగారు. తాము నెల్లూరులో ఉన్న సమయం నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉందని గుర్తు చేసారు.
ప్రభుత్వ వ్యవహార శైలి.. నియోజకవర్గంలో డెవలప్ మెంట్ లేకపోవటం పైన ఆనం తన అభిప్రాయాలు వ్యక్తం చేయటమే నేరంగా ప్రభుత్వంలోని పెద్దలు భావించినట్లు ఉన్నారని పవన్ చెప్పుకొచ్చారు.
కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తా
ఆనంకు రక్షణ కోసం కేటాయించిన సిబ్బందిని తగ్గించారని పేర్కొన్నారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకొని ఆనం రామనారాయణ రెడ్డి రక్షణ బాధ్యతలను డీజీపీ తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేసారు. తగిన రక్షణ ఏర్పాటు చేయాలని కోరారు. డీజీపీ బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోం శాఖకు లేఖ రాసి రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తానని పవన్ చెప్పుకొచ్చారు.
అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు భయంతో ఉన్నారని..స్వేచ్ఛగా మాట్లాడుకొనే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యేలపై నిఘాలు..ఫోన్ సంభాషణలు దొంగ చాటుగా వినటం పాలకుల అభద్రతా భావాన్ని తెలుపుతోందని పవన్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి నేరుగా సీఎం, ఆయన కార్యాలయం పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోం మంత్రి ఎందుకు మాట్లాడలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
ప్రభుత్వానికి అల్టిమేటం
ఆనం రామనారయణ రెడ్డి చేసిన ప్రాణ హాని ప్రకటన..కోటంరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల గురించి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేసారు. ఇప్పటికే కోటంరెడ్డి వ్యవహారం రెండు రోజులుగా అధికార పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. కోటంరెడ్డి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారని..లోకేష్ తో ఫోన్ లో టచ్ లో ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
టీడీపీ నాయకత్వం సూచనల మేరకే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసారని పేర్కొన్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉంటూ పార్టీ నాయకత్వంతో విభేదించిన నెల్లూరు జిల్లా ఇద్దరు ఎమ్మెల్యేలకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్..ప్రభుత్వానికి చేసిన డిమాండ్ల పైన ఇప్పుడు వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.