చిన్నన్నా సారధ్య బాధ్యత నీదే: నాగబాబుకు అప్పగించిన పవన్: ప్రజారాజ్యంలో నాడు అలా..మరి నేడు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆలస్యం జరిగిందని..ఇక పార్టీని క్షేత్ర స్థాయి లో బలోపేతం చేయాలంటే కీలక నిర్ణయాలు తప్పవని గుర్తించారు. అందులో భాగంగా చిన్నన్న నాగబాబుకు పార్టీలో ముఖ్య బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా ఎన్నికల్లో నర్సాపురం నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిన నాగబాబు సేవలను పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం కోసం వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. గతంలో ప్రజారా జ్యం లోనూ కీలక భూమిక పోషించిన నాగబాబు ఇక ఇప్పుడు తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలోనూ కీ రోల్కు సిద్దం అవుతున్నారు.
నాగబాబుకు కీలక బాధ్యతలు..
జనసేన పార్టీని క్షేత్ర స్థాయి నుండి ప్రతీ దశలోనూ బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ కార్యాచరణ సిద్దం చేస్తున్నా రు. అందులో భాగంగా తన చిన్నన్న నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. పార్టీలో క్షేత్ర స్థాయిలో పని చేసే శ్రేణులకు..నేతలకు మధ్య సమన్వయం లేదని పవన్ గుర్తించారు. అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నా వారిని పార్టీ కోసం ముందుండి నడిపించే నేతలు లేరని..ఉన్న వారు సైతం కో ఆర్డినేషన్ సమస్యల కారణంగా సరిగ్గా వ్యవహరించలేకపోతున్నారని పవన్ అభిప్రాయ పడ్డారు. దీంతో..తన మీద అభిమానం చూపించే పార్టీ కార్యకర్త లతో పాటుగా అభిమానులకు గుర్తింపు ఇచ్చేలా పార్టీతో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. దీని కోసం పార్టీ సమన్వయ కమిటీ ఏర్పాటుకు పవన్ డిసైడ్ అయ్యారు. ఈ కమిటీ పూర్తిగా క్షేత్ర స్థాయిలో ఉన్న పార్టీ శ్రేణులను.. నేతల మధ్య వారధిగా పని చేస్తుంది. ప్రతీ జిల్లా స్థాయిలో ఇటువంటి కమిటీలను ఏర్పాటు చేసి..రాష్ట్ర స్థాయి కమిటీతో అనుసంధానం చేస్తారు. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ బాధ్యతలను నాగబాబుకు అప్పగించనున్నారు.
పవన్ అప్పగించారు..నాగబాబు ఏం చేస్తారు..
జనసేనలో కీలకమైన సమన్వయ కమిటీ సారధ్య బాధ్యతలను అప్పగించటం ద్వారా పవన్ కళ్యాణ్ తన చిన్నన్నకు పెద్ద బాధ్యతే అప్పగించారు. అయితే, చిరంజీవి..పవన్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ కారణంగా వారు క్షేత్రస్థాయి నాయకులను కలిసేందుకు వీలు పడేది కాదు. దీంతో..నాడు ప్రజారాజ్యంలోనూ ఇదే రకంగా నాగబాబుకు బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆ తరువాతి పరిస్థితుల కారణంగా చిరంజీవి కొందరి మాటలకే ప్రాధాన్యత ఇచ్చి ప్రజారాజ్యం ను కాంగ్రెస్లో విలీనం చేసారనే ఆవేదన మెగా బ్రదర్స్ ఇద్దరిలోనూ కనిపించేంది. అయితే, అన్నయ్య మీద గౌరవం తో బయట ఎప్పుడూ కామెంట్ చేయలేదు. ఇక, ఇప్పుడు జనసేన పరిస్థితి మాత్రం అలా కాకూడదని.. ఎదురు దెబ్బలు తగిలినా పోరాటం చేసి పార్టీ నిలబెట్టుకోవాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతో..ఎన్నికల ఫలితాలు వ్యతిరేకం గా ఉన్నా వెంటనే పార్టీ నేతలతో సమీక్షలు ప్రారంభించారు. ఇప్పుడు నాగబాబును పార్టీలో యాక్టివ్ చేయటం ద్వారా మరింతగా మద్దతు లభిస్తుందని పవన్ అంచనా వేస్తున్నారు.
అమెరికాకు పవన్ కళ్యాణ్..
అమెరికాలో జరిగే తానా సభల నుంచి రెండో వారంలో తిరిగొచ్చాక పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటనలు తలపెట్టారు. జిల్లాల్లో పర్యటనలకు ముందే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఆ బాధ్యతలను నాగబాబుకు ఇవ్వటం ద్వారా ఆయన జిల్లా స్థాయి నుండి పార్టీ బలోపేతం మీదే దృష్టి సారించనున్నారు. కేడర్తో దగ్గరగా ఉండటంలో నాగబాబు ప్రజారాజ్యం సమయం నుండి కీలకంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. మెగా ఫ్యాన్స్ సైతం నాగబాబుతో ఎక్కువగా టచ్లో ఉంటారు. దీంతో..తాజా ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా ఆ నష్టాన్ని కొంత భర్తీ చేసుకోవాలని పవన్ భావిస్తున్నారు. దీంతో..ఆయన అమెరికా పర్యటన నుండి వచ్చిన తరువాత జనసేన పార్టీలో మరింత యాక్టివిటీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.