ఢిల్లీ బయలుదేరిన జనసేనాని .. కేంద్ర పెద్దలతో రాజధానిపై పవన్ .. సర్వత్రా ఉత్కంఠ
ఏపీలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి . రాజధాని అమరావతి కోసం ప్రతిపక్ష పార్టీలు పోరాటం సాగిస్తున్నాయి. శాసన సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసి బిల్లు కూడా ఆమోదం పొందిన నేపధ్యంలో రాజధానిగా అమరావతి కొనసాగించాలని ఏపీకి శాశ్వత రాజధాని అమరావతినేనని ఏపీ రాజధాని సమస్యపై కేంద్ర నాయకులను కలవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు .
రాజధాని భవిష్యత్ కై రేపు ఢిల్లీకి వెళ్తున్న పవన్ .. బీజేపీతో కలిసి జగన్ పై జనసేనాని వార్
తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని అమరావతి విషయంలో కేంద్ర పెద్దలతో మాట్లాడటం కోసం వెళ్తున్నారు. అమరావతి కదలదు , ఏపీకి శాశ్వత రాజధాని అమరావతినే అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్ కాసేపట్లో ఢిల్లీ చేరుకుని బీజేపీ అధిష్ఠానంతో భేటీ అయ్యి ఏపీలో తాజా పరిస్థితులు, రాజధాని అమరావతి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.
రేపు మధ్యాహ్నం వరకు వారు ఢిల్లీలోనే ఉంటారు.ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని జాతీయ స్థాయిలో తెలిసేలా చేసి కేంద్రం చొరవ చూపేలా చెయ్యాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ నేతలతో చర్చించేందుకు పవన్ వెళ్లారు. రాజధాని అంశంపై బీజేపీతో కలిసి పోరాడడానికి జనసేన నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో రాజధాని అమరావతి విషయంలో కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో.. పవన్ ఏం చెయ్యనున్నారో అన్నది ఉత్కంఠ రేపుతుంది. మరి ఢిల్లీలో రాజధాని విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.