శాసనమండలి రద్దుపై పవన్ కళ్యాణ్ స్పందన: జనసేన బలోపేతం కోసం ఇలా ముందుకు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మండలి రద్దు సవ్యమైన చర్య కాదని ఆయన అన్నారు. శాసనమండలి రద్దు తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం: సీఎం జగన్ కీలక ప్రసంగం
వైఎస్ మండలిని పునరుద్దరిస్తే..
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పునరుద్ధరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్యాంగ రూపకర్తలు ఎంతో ముందుచూపుతో రాష్ట్రాల్లో రెండు సభల ఏర్పాటుకు అవకాశం కల్పించారని తెలిపారు. శాసనసభలో పొరపాటు నిర్ణయం తీసుకున్నప్పడు దానిపై పెద్దల సభలో మేథోపరమైన మథనం కోసమే ఉన్నతాశయంతో మండలి ఏర్పాటైందని పవన్ కళ్యాణ్ వివరించారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యలో మండలిని రద్దు చేయడం సరైన చర్య కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థలను తొలగించుకుంటూ పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అన్నారు. శాసనమండలి రద్దుకు ప్రజామోదం ఉందా? లేదా? అనే అంశాన్ని ఏపీ సర్కారు పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు. వికేంద్రీకరణ బిల్లు మండలిలో నిలిచిపోతే దానిని రద్దు చేయడం సహేతుకంగా లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. మండలి రద్దుతో మేధావుల ఆలోచలను రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించే అవకాశాన్ని మనం కోల్పోయినట్లేనని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
ఆ రెండు పార్టీలను కాదని బీజేపీ మనతో..
ఇది ఇలావుంటే, సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలందరినీ ఆత్మీయంగా పలుకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దేశ సమగ్రత, ప్రయోజనాలకు అవసరమయ్యే భావజాలం మన పార్టీకి ఉందన్న విశ్వాసంతోనే మనతో కలిసి నడవాలని భారతీయ జనతా పార్టీ పొత్తుపెట్టు కొందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భవిష్యత్తు ఉన్న పార్టీ అని నమ్మిందన్నారు. యువత నమ్మకం, ఆడపడుచుల దీవెనలతో పార్టీ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రెండు పార్టీలను కాదని మనతో కలిసి నడవాలనుకున్నారంటే మనకు ప్రజల్లో ఎంత బలముందో తెలుసుకోవాలని అన్నారు.
అర్జెంటుగా గద్దెనెక్కాలని రాలేదు..
‘ఒంగోలు అంటే నాకు ప్రత్యేక అభిమానం. పోరాటయాత్రలో భాగంగా ఒంగోలు వస్తే అపూర్వ స్వాగతం లభించింది. దశాబ్దాలుగా ఒంగోలు ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. పరిశ్రమలు, ఉపాధి, నీటి సౌకర్యం లేక వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నికల సమయంలో రూ. 150 కోట్లు ఖర్చు చేసే సామర్ధ్యం ఉన్న నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు కానీ... రూ. 150 కోట్లుతో పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉన్న నాయకులు మాత్రం లేరు. ఇలాంటి పరిస్థితులు మారాలనే జనసేన పార్టీ పెట్టాను. అర్జెంటుగా గద్దెనెక్కాలనే ఆశ లేదు. దేశం కోసం పని చేయాలనే పాతికేళ్ల ప్రస్థానమని చెప్పాను' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఆర్ఎస్ఎస్ లాగే మనకు కూడా..
పార్టీ నిర్మాణం చాలా కష్టంతో కూడుకున్న పని. నా ప్రభావం సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే ఉద్దేశంతోనే ఫ్యాన్సు ఆర్గనైజేషన్ పెట్టలేదు. ప్రజారాజ్యం పార్టీ అనుభవం తర్వాత కూడా పార్టీ పెట్టడం దుస్సాహసం. సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనతోనే పార్టీ పెట్టాను. నిజంగా జనసేన పార్టీకి అధికారమే లక్ష్యమైతే ఆ రాజకీయం వేరుగా ఉండేది. సమాజంలో లోపాలను రాజకీయ పార్టీలు సరిదిద్దాలి. లేకపోతే ప్రజల మధ్య అసమానతలు తలెత్తి దేశ సమగ్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ లాగా జనసేన పార్టీకి కూడా ఒక బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్ ఇంత బలంగా తయారవ్వడం వెనుక దశాబ్ధాల కృషి, బలమైన భావజాలం ఉంది. క్రియాశీలకంగా పనిచేసే చాలా మంది దేశం కోసం సర్వం త్యాగం చేస్తారు. పెద్దగా హిందువులు లేని ఈశాన్య ప్రాంతంలో కూడా బీజేపీ గెలిచింది అంటే దానికి కారణం వాళ్ల కమిట్మెంట్. అక్కడ అందరితో మాట్లాడి, వాళ్లను ఒప్పించి పార్టీకి ఓట్లు వేసేలా చేశారు.
ఆర్ఎస్ఎస్ సంస్థ దేశం, అభివృద్ధి చూస్తుందే తప్ప వారసత్వాన్ని చూడదు. జనసేన పార్టీని ఇష్టపడేది యువత, మధ్య తరగతి మనుషులు. ఎక్కువగా స్వశక్తిని నమ్ముకున్న వాళ్లే జనసేన పార్టీకి అండగా ఉంటున్నారు. నిజంగా వీళ్లు బలంగా సమాజంలో మార్పు రావాలని కోరుకుంటే మార్పు వచ్చి తీరుతుందన్నారు పవన్ కళ్యాణ్.
ఓటుకు నోటు ఉండకూడదు..
డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలకు వెళ్లడం అసాధ్యంగా మారింది. ఉత్తరాదితో పోల్చుకుంటే ఈ పరిస్థితి తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో చాలా ఎక్కువగా ఉంది. దీనిని మార్చకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. మొన్నీమధ్య ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ‘మీకెందుకు పనులు చేయాలి. ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకున్నారు కదా' అని ప్రజల్ని తిట్టాడు. అలాంటి వ్యవస్థ, నాయకులు అవసరమా..? అనిపించింది. డబ్బు ఇచ్చి ఓట్లు కొనకూడని పరిస్థితికి సమాజాన్ని తీసుకెళ్లాలి. అలాంటి సమాజాన్ని జనసేన పార్టీ తీసుకొస్తుంది. రాజకీయ నాయకులు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడాలి. కానీ కొంతమంది నాయకులు స్వార్ధ రాజకీయాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సమాజాన్ని విడగొట్టడం చాలా తేలిక, కానీ కలపడం మాత్రం చాలా కష్టం.
ప్రగల్భాలు పలికే వలస పక్షులను కాకుండా మన పార్టీ మీద ప్రేమ ఉన్న యువతను గుర్తించండి. పార్టీకి ఎక్కువ సమయం కేటాయించే వాళ్లకు కీలక బాధ్యతలు అప్పగించండి. త్వరలోనే యువతకు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఓటుకు నోటు తీసుకోవడం వల్ల వాళ్లు నష్టపోతుంది ఏంటో తెలియజేస్తాం' అని పవన్ తెలిపారు. ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ షేక్ రియాజ్ పాల్గొన్నారు.