సీఎం జగన్ పైన పవన్ సంచలనం : తన లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతారా: పారిశ్రామిక వేత్తలను భయ పెడుతూ..!!
Recommended Video
ముఖ్యమంత్రిగా జగన్ వంద రోజుల పాలన మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్లు చేసారు. వైసీపీ మేనిఫెస్టో జనరంజకంగా ఉందని..పాలన మాత్రం జన విరుద్దగా ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. జగన్ పాలనలో పారదర్శకత..విజన్ లోపించాయని విమర్శించారు. టీడీపీ ఓడిపోవటానికి ఇసుక మాఫియా ఒక కారణమని..మూడున్నార నెలలు అయినా ఇసుక విధానం తేలేక పోయారన్నారు. వైసీపీ పథకాలు అమలు కావాలంటే 50 వేల కోట్లు కావాలని..పెట్టుబడులు రాకుండా చేస్తున్న వైసీపీ నేతలు..వీటి కోసం జగన్ దాచిన లక్ష కోట్లు తీసుకొస్తారా అని ప్రశ్నించారు. ఉన్న పెట్టుబడిదారుల మీద వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. మూడున్నార నెలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజా వేదిక కూల్చటం మినహా ఏదీ సాధించలేదన్నారు. టీడీపీ నేతలు కనపడకుండా పోతే సుపరిపాలన అందిస్తారా అని ప్రశ్నించారు. మద్య నిషేధం పైన నమ్మకం కలగటం లేదన్నారు. మంత్రుల పైన పవన విమర్శలు చేసారు. వివేకా హత్య కేసును ఎందుకు తేల్చ లేక పోయారని ప్రశ్నించారు. దీని పైన నిర్దేశిత సమయం లోగా తేల్చకపోతే..సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామని పవన్ హెచ్చరించారు.
లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతారా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ పాలన పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పాలన జన విరుద్దంగా సాగుతోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుక విధానం తప్పు బట్టిన వైసీపీ ఇప్పుడు ఏం చేస్తోందని..లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని..నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు. ప్రభుత్వంలో పారదర్శకత లోపించిందని కామెంట్ చేసారు. ఏపీలో వైసీపీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 50 వేల కోట్లు కావాలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం గత పాలనలో తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని కానీ, ఏపీ భవిష్యత్ ను డోలాయమానంలోకి నెట్టకూడదన్నారు. పీపీఏల విషయంలో జగన్ ఎవరు చెప్పినా వినకుండా మొండిగా వెళ్తున్నారని ఆరోపించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన వారికి గౌరవించాల్సింది పోయి..పెట్టుబడులు పెట్టటానికి ఎవరూ ముందుకు రాకుండా పరిస్థితి తయారు చేస్తున్నారని విమర్శించారు. కియో సీఈవోను స్థానిక వైసీపీ నేతలు అవమానించారని..పెట్టుబడులు ఇక ఎలా వస్తాయని ప్రశ్నించారు. బ్యాంకులు రుణాలు ఇవ్వమని చెబుతుంటే కనీసం ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. మరి పధకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నిస్తూనే..గతంలో ఆరోపణలు చేసిన విధంగా దాచిన లక్ష కోట్లు తీసుకొచ్చి పెట్టుబడిగా పెడతారా అంటూ పవన్ ప్రశ్నించారు. జగన్ పాలనలో విజన్ లోపించిందని విమర్శించారు.
వైసీపీ కార్యకర్తలే గ్రామ వాలంటీర్లుగా...
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల కోసం కార్యకర్తలను సిద్దం చేస్తోందని పవన్ విమర్శించారు. వైసీపీ కార్యకర్తలనే గ్రామ వాలంటీర్లుగా నియమించారని ఆరోపించారు. క్రిష్టా జిల్లాలోనే 8300 మంది డెంగ్యూ.. టైఫాయిడ్.. మలేరియా బాధితులు ఉన్నారని వెల్లడించారు. పోలవరం విషయంలో పీపీఏ చెప్పినా వినకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పీపీఏ రీయంబర్స్ చేయని సొమ్మును తన సొంత సిమెంట్ ఫ్యాక్టరీ నుండి తెస్తారా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. వరదలు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి అమెరికాలో ఉన్నారని..మంత్రులు హానీమూన్ పిరీయడ్ గా వ్యవహరించరంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఆ నీటిని రాయలసీమకు తరలించి ఉంటే మేలు జరిగేదన్నారు. అమరావతికి గెజిట్ ఇవ్వలేదని బొత్సా చెబుతున్నారని..దీని ద్వారా తప్పించుకోలేరన్నారు. అమరావతిలో పెట్టిన ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు ఏం కావాలని పవన్ ప్రశ్నించారు. రైతు కన్నీరు పెడితే మంచిది కాదని..రైతుల సమస్యల పైన మంత్రులు వెటకారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక, మద్యం అమ్మకాలు ప్రభుత్వం తగ్గాయని చెబుతున్నారని...లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేసారు.
వివేకా హత్య కేసు సీబీఐకి ఇవ్వాలి..
జగన్ పైన జరిగిన హత్యా యత్నం కేసు ఏమైందని పవన్ ప్రశ్నించారు. అదే విధంగా సొంత బాబాయ్ ను దారుణంగా హత్య చేస్తే అప్పుడు సీబీఐ విచారణ అడిగిన జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎందుకు సీబీఐకు ఇవ్వటం లేదని నిలదీసారు. దీని పైన నిర్దిష్ట కాలంలోగా వాస్తవాలు బయటకు రాకపోతే..తాము అఖిలపక్షం ఏర్పాటు చేసి సీబీఐ కోరుతామన్నారు. ఈ మూడున్నార నెలల కాలంలో ప్రజావేదిక కూల్చటం మినహా మరేదీ జగన్ సాధించలేదన్నారు. టీడీపీ నేతలు కనిపించకుండా పోతే జగన్ సుపరిపాలన అందిస్తారా అని ప్రశ్నించారు. ఇక..ప్రత్యేక హోదా పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రజలు హోదా అంశం మనది అనుకున్న సమయంలో పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే తాము పోరాటం చేసి వదిలేసామని..ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ హోదా కోసం పోరాడాలని పవన్ ఏపీ సీఎం కు సూచించారు. ప్రభుత్వం విధానాలు మార్చుకోకుంటే పోరాటాలకు దిగుతామని పవన్ హెచ్చరించారు.