తక్షణం రైతులను ఆదుకోకుంటే ఆ పని చేస్తాం .. జగన్ సర్కార్ కు జనసేనాని హెచ్చరిక , గ్రేటర్ ఫలితాలపైన కూడా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అధికార పార్టీ పై ఒత్తిడి తెస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. రాష్ట్రంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించడం కోసం, రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Recommended Video
రజనీ పొలిటికల్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ , చంద్రబాబు స్పందన ఇదే .. వ్యవసాయ చట్టాలపై కూడా పవన్ రెస్పాన్స్
రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు
ఈ క్రమంలో తాజాగా ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు.
నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని పేర్కొన్నారు. నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వడం కోసం, మనో ధైర్యం చెప్పడం కోసం తాను వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తక్షణం సాయం చెయ్యండి .. లేదంటే దీక్షలకు దిగుతాం
మద్యపానం ద్వారా రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని రైతుల కోసం కేటాయించాలని, తక్షణమే సాయం చెయ్యాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతులకు మద్దతుగా ఈ నెల ఏడవ తేదీన నిరసన దీక్ష చేపడతామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఈ ఏడాది మూడోసారి పంట నష్టపోయి ఆవేదన చెందుతున్నారని పేర్కొన్న పవన్ కళ్యాణ్ కోసం రైతుల కోసం, భావితరాల భవిష్యత్ కోసం జనసేన పార్టీ పని చేస్తుందని వెల్లడించారు.
నెల్లూరు పర్యటనలో చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరువేసుకున్న పవన్ కళ్యాణ్
అలాగే నెల్లూరు తో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్న పవన్ కళ్యాణ్, నెల్లూరు తన అమ్మ వాళ్ల ఊరు అని, తాను అక్కడే పుట్టి పెరిగానని నెల్లూరు అంటే తనకు ఎనలేని అభిమానం అని స్పష్టం చేశారు. చిన్నప్పుడు గొప్ప ఆశయాలు ఏవి ఉండేవి కాదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎస్సై కావాలనుకున్నాను అంటూ, ప్రజలను రక్షించాలని అనుకునేవాడిని అంటూ పేర్కొన్నారు. సాటి మనిషికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ ప్రారంభించాలని చెప్పిన పవన్, సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా కీలకంగా పని చేశానని స్పష్టం చేశారు.
గ్రేటర్ ఫలితాలు ,.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్తున్నాయన్న జనసేనాని
జనసేన పార్టీని ప్రారంభించాక పార్టీని నడపటం అని కొందరు ఆశయాన్ని నీరుగార్చిన తాను భయపడేది లేదని చెప్పుకొచ్చారు. విజయం సాధించినా ఓటమి పాలైనా తన పోరాటం మాత్రం ఆగదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టంగా తెలిపారన్నారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలకు బలమైన సంకేతం పంపేలా ఎన్నికల ఫలితాలు ఉన్నాయని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి సమన్వయ కమిటీ వేస్తున్నట్లు చెప్పిన పవన్ స్థానిక నాయకత్వం అభిప్రాయాలను తీసుకుని తిరుపతి ఉప ఎన్నిక పై తీసుకుంటామని స్పష్టం చేశారు.