Happy birthday modi:ప్రజల గుండెల్లో చిరస్థాయిగా.. పవన్ కల్యాణ్ విషెస్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారని.. కానీ కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. అలాంటి వారిలో మోడీ ప్రథముడు అని కొనియాడారు. మోడీ బర్త్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ లేఖలో శుభాకాంక్షలు తెలిపారు.
నేత అంటే వ్యక్తి కాదు శక్తి అని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకు దేశభక్తి, నిస్వార్థం, సేవాతత్పరత, నిబద్ధత, దృఢ సంకల్పం మెండుగా ఉండాలని పేర్కొన్నారు. అలాంటి వారికే ప్రజలు బ్రహ్మారథం పడతారని చెప్పారు. అలాంటి గొప్ప వారిలో మోడీ అగ్రస్థానంలో ఉంటారని పవన్ కల్యాణ్ తెలిపారు. అంతేకాదు ఆయన చిన్నతనంలోనే సామాజికసేవకు ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు. ఆ సేవను నిర్విరామంగా కొనసాగిస్తూ దృఢమైన నాయకుడిగా రూపుదిద్దుకున్నారని ప్రశంసించారు.
దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన మోడీ.. దేశ అత్యున్నత పదవీ ప్రధానమంత్రి చేపట్టడం సాధారణ విషయమేమీ కాదన్నారు. జీవితంలో ఆయనకు ఎదురైన ఒడిదుడులను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నరేంద్ర మోడీ జీవితం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. భారత్ శాంతికాముక దేశంతో పాటు, శత్రువులు కన్నెత్తి చూడలేని శక్తిమంతమైన దేశం అని ప్రపంచానికి మోడీ చాటిచెప్పారని తెలిపారు.
Recommended Video
దేశ హితం కోసం మోడీ తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. అందుకే రెండోసారి కూడా ఆయనను దేశ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారని గుర్తుచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీకు భగవంతుడు సంపూర్ణ ఆయుష్షు, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. జనసైనికుల తరపున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని లేఖలో పవన్ పేర్కొన్నారు.