అఖిలప్రియా.. అమ్మానాన్నను కోల్పోయావ్.. ఆ బాధ నీకే ఎక్కువ తెలియాలి: పవన్
Recommended Video
ఒంగోలు: ఒంగోలు పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడలో జరిగిన ఫెర్రీఘాట్ బోటు ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారితో మాట్లాడి, వారి బాధను తగ్గించే ప్రయత్నం చేశారు.
నవంబర్ 12న విజయవాడ సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తా పడటంతో 22 మంది ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే. కార్తీక మాసంలో విహార యాత్రకు వచ్చిన ఒంగోలు వాకర్స్ క్లబ్ సభ్యుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఈ ఘటనపై శనివారం ఒంగోలులోని ఎన్టీఆర్ కళా క్షేత్రంలో మాట్లాడుతూ అధికార తెలుగుదేశం ప్రభుత్వం మీదో, పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ మీదో మాటల దాడి చేసేందుకు తాను ఈ వేదికను ఉపయోగించడం లేదని పవన్ స్పష్టం చేశారు.
మీరే ఆ బాధను అర్థం చేసుకోగలరు...
ఫెర్రీఘాట్ ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల బాధ, ఆవేదనను ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ అర్థం చేసుకోవాలని సూచించారు. ‘అఖిలప్రియా.. ఓటు అనే బోటు మీద మీరు తీరం దాటారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు.. మీరు అతికొద్ది కాలంలోనే తల్లినీ తండ్రీనీ కోల్పోయారు. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి సాటివాళ్ల బాధను మీరు అర్థం చేసుకోగలరు.. బాధితులను పరామర్శించడం, ఓదార్చడం ఒక ప్రజాప్రతినిధిగా మీ బాధ్యత..'' అంటూ జనసేనాని వ్యాఖ్యానించారు.
రెండుసార్లు మీ విజయానికి నేను తోడ్పడ్డా...
శోభ నాగిరెడ్డి దంపతులు తనకు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుసునని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘‘మీరు వైసీపీలో ఉన్నప్పుడు మీ నాన్న నాకు ప్రత్యర్థి కావాలి. నేను వస్తే ఓడిపోతానంటే.. ఎన్డీయేకి మద్దతు ఇచ్చినప్పటికీ మీరు అమ్మను కోల్పోయారనే కారణంతో నేను నంద్యాలలో ప్రచారం చేయలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. పరోక్షంగా రెండుసార్లు మీ విజయానికి నేను తోడ్పడ్డా..'' అని పవన్ మంత్రి భూమా అఖిలప్రియను ఉద్దేశించి మాట్లాడారు.
అసలు ఆ పరిస్థితే రాకూడదు...
మనుషులు కొన్నిసార్లు చేసిన పనే చేసి చేసి విసిగిపోయి ఉంటారని, ఇలాంటప్పుడే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారని, కానీ సున్నితత్వాన్ని ఎప్పుడూ కోల్పోకూడదని జనసేనాని ఉద్వేగంగా మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పుడు రాజకీయా నాయకులు ఎక్స్గ్రేషియా ప్రకటించేసి తమ పని అయిపోయిందని భావిస్తారని, అది తప్పు అని అన్నారు. ఎక్స్గ్రేషియాలతో ప్రాణాలు తిరిగిరావని, అసలు వాటిని ప్రకటించే పరిస్థితి రాకుండా చూడాల్సిన్న బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉందన్నారు. ‘‘మీ ఇంట్లోనే ఎవరినైనా కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో చూడండి. ఇలాంటి క్షోభ మరే కుటుంబానికి రాకుండా చేయాలంటే ఏ చర్యలు తీసుకోవాలో ఆలోచించండి..'' అంటూ హితవు పలికారు.
స్పందించకపోవడమూ బాధ్యతారాహిత్యమే...
ఫెర్రీఘాట్ బోట్ ప్రమాద ఘటనలో తాను పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియను తప్పుబట్టడం లేదంటూనే లాల్ బహదూర్ శాస్త్రి ఉదంతాన్ని జనసేనాని ప్రస్తావించారు. లాల్ బహుదూర్ శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే.. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని తెలిపారు. ‘‘మంత్రి అఖిల ప్రియ అలా చేయనక్కర్లేదు. కానీ ఇక్కడికి రావాలి. మీ తప్పేం లేదు. కానీ మంత్రిగా బాధ్యత వహించి.. బాధితులతో మాట్లాడాలి. ప్రజాసమస్యల పట్ల స్పందించకపోతే.. మీది బాధ్యత రాహిత్యమే అవుతుంది. మీ కుటుంబంతో ఉన్న అనుబంధం వల్ల చెబుతున్నా. వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడండి. ఇలాంటి ఘటనలు జరగకుండా.. ఏం చర్యలు తీసుకోవాలో మార్గదర్శకాలు రూపొందించండి..'' అని పవన్ కళ్యాణ్ సూచించారు.