వైసీపీ గెలుపు పై పవన్ సంచలన వ్యాఖ్యాలు!! కాలం కలిసొచ్చో.. ఈవీఎంల ఘనతో.. బొత్సా జాగ్రత్త!
జనసేన అధినేత వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాలం గొప్పతనమో..ఈవీఎంల ఘనతో వైసీపీ అధికారంలోకి వచ్చిదంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. కులం రంగు పులిమి రాజధాని మారుస్తామంటే కుదరదని స్పష్టం చేసారు. కులం పేరుతో పులివెందులకో..దొనకొండకో తరలిస్తామంటూ కుదరదన్నారు. రాజధానిని మారిస్తే ప్రధాని మోదీ..అమిత్ షాను వ్యతిరేకించటమేనని చెప్పుకొచ్చారు. అవినీతిని మోదీ క్షమించరని..బొత్సా సత్యానారాయణ జాగ్రత్తగా ఉండాలంటూ వోక్స్ వ్యాగన్ అంశాన్ని ప్రస్తావించారు. అధికారులు సైతం ఎవరు ఏది చెబితే దానికి తగినట్లుగా ఆదేశాలు ఇవ్వద్దని..మరోసారి వైసీపీ వస్తుందో లేదో తెలియదని పేర్కొన్నారు. వైసీపీ మీద కేంద్రం కన్ను ఉందని..జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని..గత పాలకులు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. ఈ ప్రభుత్వంలో బొత్సా సైతం ముఖ్యమంత్రి అవుతారేమో అంటూ వ్యాఖ్యానించారు.
కాలం కలిసొచ్చో..ఈవీఎంల ఘనతో వైసీపీ గెలిచింది..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గురించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మీద కీలక వ్యాఖ్యలు చేసారు. కాలం కలిసొచ్చో..ఈవీఎంల ఘనతో వైసీపీ గెలిచిందో తనకు తెలియదని పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. రాజధాని రైతులకు మద్దతుగా మాట్లాడిన పవన్.. జగన్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేసారు. అధికారంలో ఎవరూ శాశ్వతం కాదని.. వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. కులం రంగు పులిమి రాజధానిని పులివెందులకో..దొనకొండకో మారుస్తామంటే కుదరదని స్పష్టం చేసారు. 2014లో అధికారంలోకి వచ్చి ఉంటే మీరు భూములు కొన్న దొనకొండలో రాజధానిగా నిర్ణయించే వారేమోనని.. ఇప్పుడు మాత్రం కుదరదని చెప్పుకొచ్చారు. వంద రోజులు ఈ ప్రభుత్వం మీద ఏదీ మాట్లాడ కూడదని అనుకున్నాం. కానీ, మాట్లాడే పరిస్థితి వారే తీసుకొచ్చారు. వచ్చినప్పటి నుండి ఏది ధ్వంసం చేద్దామనే ఆలోచనలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇసుకతో ఆడుకొని ఫలితం అనుభవించిందని..ఇప్పుడు వైసీపీ కూడా అదే విధంగా చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. రైతులు ఎవరూ భూములు అమ్ముకోవద్దని.. రాజధాని ఇక్కడ నుండి తరలించటం సాధ్యం కాదని స్పష్టం చేసారు.
మోదీ చూస్తున్నారు..బొత్సా జాగ్రత్త..సీఎం అవ్వచ్చు
మంత్రి బొత్సా మీద పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ తెలివిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను బొత్సా లేదా అనిల్ తో మాట్లాడిస్తున్నారని..జగన్ రెడ్డి మాయలో పడవద్దని వారికి సూచిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. పీసీపీ అధ్యక్షుడిగా పని చేసిన బొత్సా కిరణ్ తరువాత సీఎం కావాలని ఆశించారని..సీనియర్ అయిన బొత్సా త్వరలో ముఖ్యమంత్రి అవుతారేమో అంటూ కొత్త వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోదీ అవినీతి విషయంలో కఠినంగా ఉన్నారని..బొత్సా ఇటువంటి ప్రకటనలు చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ వోక్సా వ్యాగన్ అంశాన్ని ప్రస్తావించారు. బొత్సా పెద్దరికం నిలబెట్టకోవాలని సూచించారు. 151 మంది ఎమ్మెల్యేల ఉన్నారని..ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదని చెప్పారు. తమకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నా ప్రజా వాయిస్ వినిపిస్తున్నామని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పక్కన ఉండే ఆయన సంబంధీకులు ఎవరూ ప్రజలు వ్యతిరేకించే నిర్ణయాలు..ప్రకటనలు చేయరని..బొత్సా తో మాత్రమే చేయిస్తారని చెబుతూ జగన్ మాయలో పడవద్దని సూచించారు. అదే సమయంలో కేంద్రం వైసీపీ మీద కన్ను వేసిందని..జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ప్రధాని..షాను కలుస్తాం...రాజధాని ఇక్కడే ఉంటుంది..
రాజధాని తరలింపు జరగదని..తాను అండగా నిలుస్తానని పవన్ అక్కడి రైతులకు హామీ ఇచ్చారు. తాను ఇప్పటి వరకు ప్రధానితో కలవలేదని..ముఖ్యమంత్రి నిర్ణయం మార్చుకోకుండా రాజధాని తరలింపు పైన ముందుకు వెళ్తే తాను ప్రధాని మోదీ..అమిత్ షా ను కలుస్తానని స్పష్టం చేసారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని మార్చాలని భావిస్తే ప్రధాని మాటకు వ్యతిరేకంగా చేసినట్లేనని చెప్పుకొచ్చారు. కేంద్రం అమరావతి కోసం 1500 కోట్లు ఇచ్చిందని..అది రాజధాని తరలించటానికి కాదని వ్యాఖ్యానించారు. అధికారులు సైతం జాగ్రత్తగా ఉండాలన్నారు. అధికారంలో ఉన్నవారు చెప్పారని ఉత్తర్వులు ఇస్తూ పోతే వైసీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోవచ్చని..ఇబ్బంది పడతారని హెచ్చరించారు.ఇసుక విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఇప్పుడూ చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసి ఉంటే వారి పైన చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు.