జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి: పోరాటానికి సిద్దం: పవన్ కళ్యాణ్ హెచ్చరిక..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాధితులకు న్యాయం చేయకుంటే తాము వారికి అండగా పోరాటం చేస్తామని స్పష్టం చేసారు. మొన్నటి దాకా తెలంగాణలో నల్లమలలో యురేనియం డ్రిల్లింగ్ పైన ఇతర పార్టీలతో కలిసి పోరాటానికి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ ఇప్పుడు ఏపీలో ఇదే అంశం పైన స్పందించారు. ఇందులో భాగంగా తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం యాదవాడలో తాజా పరిణామాల మీద పవన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయం స్పష్టం చేసారు. యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను పోస్ట్ చేసి.. దీనికి జగన్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆళ్ళగడ్డలో యురేనియం డ్రిల్లింగ్ ..
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం యాదవాడలో యురేనియం నిక్షేపాల గుర్తింపు కోసం సర్వే దిశగా అధికారులు ప్రయత్నాలు చేసారు. ఇది తెలుసుకున్న మాజీ మంత్రి అఖిలప్రియ అక్కడకు చేరుకొని రైతులకు సమాచారం ఇవ్వకుండా పొలాల్లో సర్వే చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఉందని బుకాయించిన సర్వే సంస్థ ప్రతినిధులు, తమకేమీ తెలియదని, అనుమతి ఇవ్వలేదని తప్పించుకోబోయిన అధికారులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ యురేనియం డ్రిల్లింగ్ ప్రయత్నాలకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ రంగంలోకి దిగారు. అక్కడ డ్రిల్లింగ్ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి..ప్రభుత్వానికి హెచ్చరికతో కూడిన సూచనలు చేసారు. గతంలో తెలంగాణ ప్రాంతంలోని నల్లమల అడవుల్లో ఇదే తరహాలో ప్రయత్నం చేయగా కాంగ్రెస్ నేత విహెచ్ ఆహ్వానం మేరకు పవన్ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు.
ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి హెచ్చరిక..
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ వద్ద యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను పోస్ట్ చేసి.. దీనికి జగన్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నల్లమలను కాపాడాలంటూ విమలక్క చేసిన ఓ పాటను కూడా పవన్ పోస్ట్ చేశారు. ఆ పాట స్పూర్తి వంతంగా ఉందన్నారు. ప్రజలకు అండగా, యురేనియంపై పోరాటానికి మద్దతుగా జనసేన ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం వద్ద ఎటువంటి సమాచారం ఉంది అని ప్రశ్నిస్తూనే..ప్రభుత్వం అనుమతితోనే సాగుతోందా అని ప్రశ్నించారు. ఈ విషయం గురించి కర్నూలు జిల్లా కలెక్టర్ తనకు సమాచారం తెలియదని చెప్పారంటూ వస్తున్న వార్తలను ఆయన ప్రస్తావించారు. కలెక్టర్ కు ఈ విషయం తెలియకపోవటం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం..
నల్లమలలో ఇదే తరహాలో యురేనియం నిక్షేపాల గుర్తింపు కోసం సర్వే అంశం పైన రాజకీయంగా దుమారం చెలరేగింది. దీని కారణంగా పర్యవరణం దెబ్బ తినటంతో పాటుగా సమీప రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రతిపక్ష పార్టీలు ఒక్కటిగా సమావేశం అయ్యాయి. దీనిని అడ్డుకోవాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారి చేసాయి. దీంతో..అసెంబ్లీ సమావేశాల్లో దీని పైన తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రైతులకు..పర్యవరణానికి నష్టం కలిగే ఎటువంటి నిర్ణయాలకు తమ మద్దతు ఉండదని స్పష్టం చేసింది. యురేనియం నిక్షేపాల డ్రిల్లింగ్ కు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేసారు. దీని ద్వారా ప్రతిపక్ష పార్టీలు.. ప్రజా సంఘాలు శాంతించాయి. ఇప్పుడు కర్నూలు వేదికగా సాగుతున్న ఈ వ్యవహారం మీద ఏపీ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.