పశువాంఛను తీర్చుకోవడానికి పసికందులే దొరికారా.?ఏపి వరుస ఘటనలపై జనసేనాని ఫైర్.!
అమరావతి/హైదరాబాద్ : ఏపిలో ఆడపిల్లల మీద జరుగుతున్న వరుస అత్యాచారాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆడపిల్లల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా అవి కాగితాలకే పరిమితం అయ్యాయి తప్ప లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోతున్నాయని జనసేన ఆవేదన వ్యక్తం చేస్తోంది. లోకజ్ఞానం తెలియని పసికందుల మీద మానవ మృగాలు అత్యాచారానికి పాల్పడుతుంటే సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.
అత్యంత హేయమైన చర్య.. చిన్నారిపై అత్యాచారంపై చలించిపోయిన జనసేనాని..
అంతే కాకుండా అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరగటం అత్యంత హేయమైన చర్య అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పశువాంఛను తీర్చుకోవడానికి పసికందులే దొరికారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎక్కడికి పోతోంది మన సమాజం అంటూ ఆక్రోశాన్ని వ్యక్తం చేసారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని రాయలపేటలో నిన్న సాయంత్రం జరిగిన ఈ సంఘటన గురించి వినడానికే జుగుప్స కలుగిస్తోందని మండిపడ్డారు. ఆ పసిదాని పరిస్థితి ఊహించుకుంటే గుండెలు భారంగా మారిపోతున్నాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేసారు.
ఆడపిల్లలపై వరుసగా అకృత్యాలు.. ప్రభుత్వం ఏం చేస్తోందన్న పవన్ కళ్యాణ్..
మృగాడి పైశాచికత్వానికి బలైపోయిన ఆ పసిపిల్ల ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోందని పవన్ కళ్యాణ్ తెలినపారు. ఆసుపత్రిలో చేర్చే సమయానికి అధిక రక్తస్రావం వల్ల ఆ పాప పరిస్థితి దయనీయంగా ఉందని పలమనేరు ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు చెబుతున్న వీడియో చూసినప్పుడు కలిగిన ఆవేదన మాటలకు అందనిదని ఆందోళన వ్యక్తం చేసారు జనసేనాని. ఆడుకోవడానికి పొరుగింటికి వెళితే 26 ఏళ్ల మానవ మృగం ఆ పసిదానిని కబళించి వేసిందని ధ్వజమెత్తారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలపై వరుసగా అకృత్యాలు జరుగుతున్నా యంత్రాంగం ఏమీ చేయని పరిస్థితిలో ఉందని ఘాటుగా విమర్శించారు.
ఎక్కడ చూసినా ఆడపిలల్ల హత్యలే.. ఫలితాలివ్వని చట్టాలన్న గబ్బర్ సింగ్..
అంతే కాకుండా ఈ మద్య విశాఖ పట్టణం గాజువాకలో 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో ఒక రాక్షసుడు గొంతును కోసేసి ప్రాణాలు తీశాడని, విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని తేజస్విని ప్రాణాలను ఆమె ఇంట్లోనే ఒక మృగాడు అత్యంత పాశవికంగా తీసేసాడని పవన్ గుర్తు చేసారు. విజయవాడలోనే ప్రేమించడం లేదని ఒక నర్సును మరో దుర్మార్గుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడని, రాష్ట్రంలో ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లో 584 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయని, నిర్భయ, దిశ వంటి చట్టాలు ఉన్నా ఆడపడుచులపై ఎందుకు దాడులు జరుగుతున్నాయని పవన్ సూటిగా ప్రశ్నించారు.
నేరం చేయాలంటేనే భయపడే శిక్షలు రావాలి.. వేగవంతమైన శిక్షలు అమలుకావాలన్న పవన్ కళ్యాణ్..
ఎప్పుడో ఖరారయ్యే శిక్షలకు ఎందుకు భయపాడాలనే ఉద్దేశంతో ఉన్మాదులు కిరాతకంగా వ్యవహరిస్తున్నారని, అందువల్ల నేరం చేయాలంటేనే భయపడే శిక్షలు రావాలని పవన్ అభిప్రాయపడ్డారు. అమ్మాయిల పట్ల అత్యాచారం చేసిన కిరాతకులకు శిక్షలు బహిరంగంగా అమలు కావాలని డిమాండ్ చేసారు. దీనిపై మేధావులు, సామాజికవేత్తలు, మహిళా సంఘాలు గళం విప్పాలన్నారు పవన్. అలా జరగకపోతే అమాయకులైన ఆడపిల్లలు బలైపోతూనే వుంటారనే ఆవేదనను గబ్బర్ సింగ్ వ్యక్తం చేసారు. రాయలపేట సంఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలని, ఆ బాలిక తల్లిదండ్రులకు తగిన పరిహారం అందించాలని, ఆ పసిబిడ్డ కోలుకునే వరకు ప్రభుత్వం అండగా ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు పవన్ కళ్యాణ్.