జనసేన ఆవిర్భావ సభ:అభిమానులకు మార్గదర్శకాలు
గుంటూరు జిల్లాలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ కోసం ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ సభలో పాల్గొనేందుకని 45బస్సుల్లో కార్యకర్తలు, అభిమానులు తరలివస్తున్నారు.
మరోవైపు జనసేనకు మద్దతుదారులైన మేధావులు, నిపుణులు విజయవాడ దుర్గ గుడి నుంచి పాదయాత్రగా సభాస్థలికి బయలుదేరారు. ఈ పాదయాత్ర ప్రకాశం బ్యారేజీ మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించి మధ్యాహ్నానికి సభాస్థలికి చేరుకోనుంది. దీంతో ఈ పాదయాత్రకు భారీగా తరలివస్తున్న అభిమానులకు జనసేన పార్టీ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మార్గదర్శకాలకు సంబంధించి పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసింది.
ఆ మార్గదర్శకాల్లో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఉదహరిస్తున్నాం...అభిమానులు టోల్ గేట్ సిబ్బందితో వివాదాలు పెట్టుకోవద్దని...ప్రచార పోస్టర్లలో పార్టీ ప్రెసిడెంట్, అనుమతించిన మరి కొందరి ఫోటోలు తప్ప ఎవరివీ వినియోగించరాదన్నారు...ఇలా అనేక మార్గదర్శకాలు సూచించిన జనసేన...చివరగా క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్లండి అనే ట్యాగ్ లైన్ తో ముగించింది.