టీడీపీ బాటలో జనసేన కూడా .. వైసీపీ నేతల నిర్వాకంపై ఈసీకి ఫిర్యాదు
ఏపీలో ఒకపక్క కరోనా వైరస్ ప్రబలుతున్నా రాజకీయ పార్టీలు మాత్రం ఎవరి పని వారు చేస్తున్నారు . బాధితులకు వైద్య సేవలు అందిస్తూనే అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు ఏపీలో ప్రజలకు విస్మయం కలిగిస్తున్నాయి . ఇక లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో రాష్ట్రం విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వంపై విమర్శలు తగవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు . జనసేన ముఖ్య నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన పలు అంశాలపై చర్చించారు .
కరోనా టార్గెట్ ... చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా చురకలు .. రోజాపై టీడీపీనేత అనిత విసుర్లు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధింపు నేపధ్యంలో ఏపీ సర్కార్ నిరుపేదలకు వెయ్యి రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తుంది. అయితే ఈ సహాయం ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అందిస్తున్న కారణంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసి మరీ ఫిర్యాదు చేశారు . కరోనా సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలపై లేఖ ద్వారా బాబు ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయంలో మాత్రం టీడీపీ మార్గంలోనే ప్రయాణం సాగించాలని నిర్ణయం తీసుకుంది జనసేన . ప్రభుత్వ సాయాన్ని వైసీపీ అభ్యర్థులు పంచడంపై ఈసీకి ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు.
ఇక అంతేకాదు కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో కరోనాను అరికట్టడానికి లాక్డౌన్తోపాటు సామాజిక దూరం పాటించాలని ప్రజలకు పవన్ సూచించారు. ఈ విపత్తు సమయంలో పేదలకు జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తనవంతు సహాయం అందించిన పవన్ కళ్యాణ్ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పారు. లాక్డౌన్ పొడిగింపుపై ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉందని పవన్ పేర్కొన్నారు. ఇక కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని, లాక్డౌన్ తర్వాతే రాజకీయాలు, పాలనలోని వైఫల్యాలపై మాట్లాడదామని జనసేనాని పవన్ పేర్కొన్నారు.