జనసేనకు మరో నేత గుడ్ బై..వైసీపీలోకి ఎంట్రీ: కాపు నేతలకు జగన్ వల: పవన్ ను అక్కడే దెబ్బ కొట్టే స్కెచ్.
జనసేనలో నేతలు ఒకరి తరువాత మరొకరు పార్టీ వీడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పటికీ పట్టు నిలిచిపోతుందని భావించిన జనసేనానికి అక్కడే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జనసేన నుండి కొందరు నేతలు బీజేపీ బాట పట్టగా..ఇప్పుడు మరో ముఖ్య నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీ నుండి జనసేనలో చేరి..ఎంపీగా పోటీ చేసిన రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన కు గుడ్ బై చెప్పారు. ఆయన ఏపీ అధికార పార్టీలో చేరాలని నిర్ణయించారు. ఇందు కోసం పార్టీ ముఖ్యులతో మంతనాలు పూర్తి చేసారు. విజయ దశమి నాడు ఆకుల సత్యనారాయణ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ చేరుతారని తెలుస్తోంది. ఆయన వైసీపీలో చేరికకు ముఖ్యమంత్రి జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాపు నేతలను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్న వైసీపీ ఇప్పుడు ఆకులను పార్టీలో చేర్చుకుంటోంది.
జనసేనకు ఆకుల సత్యనారాయణ గుడ్ బై..
జనసేన పార్టీకి మరో ముఖ్య నేత గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీని వీడనున్నారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో ఆకుల జనసేన తరపున రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఆకుల బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2019 ఎన్నికలకు ముందు బీజేపీకి గుడ్బై చెప్పి జనసేనలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రావెల కిషోర్ బాబుతో పాటుగాను పార్టీ వీడాలని భావించినా.. కొంత కాలం వేచి చూసే ధోరణితో వ్యవహరించారు. ఇక, ఇప్పుడు ఆయన పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నారు.
జగన్ సమక్షంలో వైసీపీలోకి ఎంట్రీ..
గతంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఉన్న సమయంలో..బీజేపీ ఎమ్మెల్యేగా ఆకుల సత్యనారాయణ పని చేసారు. ఆ సమయంలో జగన్ తో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. బీజేపీ నుండి జనసేనలో చేరిన ఆయన అక్కడ పార్టీలో నెలకొన్ని ప్రస్తుత పరిస్థితుల్ల పార్టీని వీడాలని నిర్ణయించారు. ఇదే సమయంలో వైసీపీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. పార్టీలోకి రావాలని ఆహ్వానం అందింది. ఆకుల సత్యనారాయణ సతీమణి సైతం గతంలో రాజకీయంగా యాక్టివ్ రోల్ ప్లే చేసారు. వైసీపీ నుండి వచ్చిన ఆహ్వానం మేరకు ఆయన పండుగ నాడు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరాలని నిర్ణయించారు.
కాపు నేతలకు వైసీపీ ఆహ్వానం..
తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా గెలుపు ఓటమలును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న కాపు ఓటర్లను మెజార్టీ స్థాయిలో తమ వైపు తిప్పుకోవటంలో వైసీపీ సక్సెస్ అయింది. టీడీపీ..జనసేనను ఆ రెండు జిల్లాల్లో బలహీనపర్చాలంటే ముఖ్యమైన కాపు నేతలను తమ వైపు తిప్పుకొనే వ్యూహానికి వైసీపీ పదును పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే టీడీపీ నుండి తోట త్రిమూర్తులను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆకుల సత్యనారాయణ వైసీపీలో జాయిన్ అవుతన్నారు. మరి కొంత మంది కాపు నేతలు సైతం త్వరలోనే వైసీపీలోకి తీసుకొచ్చే బాధ్యతలను ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపు నేతలకు అప్పగించారు.
పవన్ ను అక్కడే దెబ్బ కొట్టాలి...
గత ఎన్నికల్లో టీడీపీతో పాటుగా జనసేనను వైసీపీ భారీగా దెబ్బ తీసింది. టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయితే..జనసేన కేవలం ఒక్క స్థానం మాత్రమే దక్కించుకుంది. టీడీపీ..జనసేన బలంగా కనిపించే పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ రెండు స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా సొంత జిల్లాలో పవన్ ఓటమి చెందారు. ఇక, ఆ రెండు జిల్లాల్లో పట్టు నిలుపుకుంటే విజయం తమ వైపే ఉంటుందని సీఎం జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే..స్థానిక సంస్థల ఎన్నికలు..మున్సిపల్ ఎన్నికల్లోగా అక్కడ కీలక నేతలను వైసీపీలో చేర్చుకొనే విధంగా వ్యూహం సిద్దం చేసుకున్నారు. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ను రాజకీయంగా దెబ్బ తీస్తే..అక్కడ భవిష్యత్ లో పోటీ ఉండదని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే జనసేన నేతలతో వైసీపీ నేతలు టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.