పవన్ కళ్యాణ్కు హ్యాండిచ్చిన జేడీ.. బీజేపీలో చేరికకు ముహూర్తం ఖరారు..! మరో ముఖ్య నేత సైతం..!
Recommended Video
ఊహించిందే జరిగింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. ఇప్పటికే జనసేన కార్యక్రమాల్లో దూరంగా ఉంటున్న లక్ష్మీనారాయణ పార్టీ మారుతారంటా కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. దీనికి తగినట్లుగానే కొద్ది రోజులుగా బీజేపీ కీలక నేతలలో మంతనాలు సాగించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..లక్ష్మీనారాయణ బీజేపీలో చేరటం ఇక లాంఛనమే. లక్ష్మీనారాయణ తో పాటుగా జనసేన మరో కీలక నేత..తాజా ఎన్నికల్లో విశాఖ సౌత్ నుండి పోటీ చేసిన గంపల గిరిధర్ సైతం పార్టీ వీడి..లక్ష్మీనారాయణ తో పాటుగా బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ రోజు లేదా రేపు దీని పైన అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.
జగన్ సీఎం అయితే వెంటనే కలవాలా ? పృధ్వీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్
జనసేనకు లక్ష్మీనారాయణ గుడ్ బై...!!
సార్వత్రిక ఎన్నికల తరువాత జనసేన పార్టీకి దూరంగా ఉంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. తన సన్నిహితులతో చర్చించిన ఆయన ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. ఇప్పటికే ఆయన బీజేపీ నేతలతో మంతనాలు పూర్తయ్యాయని..బీజేపీలో చేరటం ఇక లాంఛనమే అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జగన్ కేసుల విచారణ కీలకంగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసారు. ఆ తరువాత టీడీపీలో చేరుతారని ..కాదు బీజేపీలో చేరుతున్నారని ప్రచారం సాగింది. సొంత పార్టీ దిశగా సైతం ఆలోచన చేసారు. లోక్ సత్తా పార్టీని నడిపించే బాధ్యత పైనా చర్చ సాగింది. అయితే, అనూహ్యంగా ఎన్నికల సమయంలో జనసేనలో చేరారు. ఆ పార్టీ నుండి విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత పవన్ నియమించిన పార్టీ పాలిట్ బ్యూరో..పొలిటికల్ ఎఫైర్స్ కమిటీల్లోనూ లక్ష్మీనారాయణ కు అవకాశం దక్కలేదు. అప్పుడే లక్ష్మీనారాయణ పార్టీ వీడుతా రనే ప్రచారం సాగింది. దీని పైన పార్టీ అధినేత కానీ, లక్ష్మీనారాయణ సైతం ఎక్కడా స్పందించలేదు. అయితే, తాజాగా కొందరు సన్నిహితులతో లక్ష్మీనారాయణ తన మనసులోని మాట బయట పెట్టారు. జనసేన వీడాలని నిర్ణయించినట్లుగా వారితో స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
బీజేపీ నేతలతో మంతనాలు పూర్తి...
జనసేనలో చేరటానికి ముందుగా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరుతారని అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే, అప్పుడు కేంద్ర స్థాయిలో పార్టీ మీద వ్యతిరేకత ఉందనే కారణంతో ఆయన బీజేపీలో చేరలేదని సమాచారం. అదే సమయంలో ఏపీలో ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలనే ఉద్దేశంతో లక్ష్మీనారాయణ చివరకు జనసేనలో చేరారు. విశాఖలో ఆయన బలమైన పోటీయే కాదు..గెలుస్తారనే ధీమా సైతం పార్టీలో కనిపించింది. ఎలాగైనా లక్ష్మీనారాయణ ..తన సోదరుడు నాగబాబును గెలిపించుకోవటం కోసం పార్టీ అదినేత పవన్ వారిద్దరూ పోటీ చేసిన లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ లు అయిన భీమవరం..గాజువాక నుండి పోటీ చేసారు. కానీ, లక్ష్మీనారాయణ ఇమేజ్ పని చేయలేదు. ఆ ఇద్దరూ ఓడిపోవటంతో పాటుగా రెండు స్థానాల్లో పవన్ సైతం పరాజయం పాలయ్యారు. అప్పటి నుండి లక్ష్మీనారాయణ క్రమంగా పార్టీకి దూరమయ్యారు. ఇదే సమయంలో ఆయన బీజేపీ నేతలతో తనకున్న పరిచయాల ద్వారా మంతనాలు సాగించినట్లు సమాచారం. ఏపీలో ఇప్పటికే టీడీపీ నుండి అనేక మంది నేతలు బీజేపీ వైపు చూస్తుండటం..ఇదే సమయంలో మోదీ క్రేజ్ పెరుగుతుండటంతో లక్ష్మీనారాయణ సైతం బీజేపీలో చేరాలని నిర్ణయించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లక్ష్మీనారాయణ బీజేపీ లో మరో వారం రోజుల్లో చేరే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఆయనకు ఏపీలో క్రియాశీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
లక్ష్మీనారాయణ తో పాటుగా మరి కొందరు..
జనసేన నుండి ఇప్పుడు లక్ష్మీనారాయణ బీజేపీలో చేరటం దాదాపు ఖాయమైంది. ఆయనతో పాటుగా తాజా ఎన్నికల్లో విశాఖ సౌత్ నుండి జనసేన ఎమ్మెల్యే అభ్యర్దిగా పోటీ చేసిన గంపల గిరిధర్ సైతం పార్టీ వీడాలని నిర్ణయించారు. ఆయన కూడా లక్ష్మీనారాయణ తో కలిసి బీజేపీలో చేరుతారని సమాచారం. విశాఖ నగరానికి చెందిన మరి కొందరు..ఎవరైతే ఎన్నికల్లో లక్ష్మీనారాయణ గెలుపు కోసం పని చేసిన వారిలో కొందరు ఇప్పుడు లక్ష్మీనారాయణ తో కలిసి బీజేపీలో చేరేందుకు మంతనాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. లక్ష్మీనారాయణ ఇప్పుడు బీజేపీలో చేరటం ఖాయమనే సమాచారంతో జనసేన అధినేత పవన్ కళ్యాన్.. పార్టీ ప్రతినిధలు ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. అయితే, జనసేన సైతం బీజేపీతో భవిష్యత్ లో పొత్తు పెట్టుకొనే అవకాశం ఉండటంతో..లక్ష్మీనారాయణ విషయంలో వ్యతిరేకంగా స్పందించే అవకాశాలు లేవని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో, ఇక లక్ష్మీనారాయణ బీజేపీలో చేరటం లాంఛనమే.