పవన్ రెండు చోట్లా గెలుస్తున్నారా... ఎఫెక్ట్ ఎవరికి...? ఆ రెండు పార్టీల్లో కొత్త టెన్షన్ ..!
ఏపీలో పోలింగ్ పూర్తయిన తరువాత జనసేన మౌనంగా ఉంది. టీడీపీ..వైసీపీ అధికారం మాదంటే మాదంటూ హంగామా చేస్తున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తాలు ఫిక్స్ చేస్తున్నారు. దీంతో..జనసేన ఈ ప్రచారంలో వెనుకబడింది. కానీ, సడన్గా జనసేన నేతల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో జనసేన వైపు బెట్టింగ్ రాయుళ్లు మొగ్గు చూపుతున్నారు. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల మీదా కొత్త అంచనాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ హంగామా తో ఇప్పుడు ఆ రెండు పార్టీల్లో కొత్త టెన్షన్ మొదలైంది.
పవన్ రెండు చోట్లా గెలుస్తారా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి అదే విధంగా విశాఖ జిల్లా గాజువాక నుండి బరిలో ఉన్నారు. అయితే, ఆయన రెండు స్థానాల్లో ఎక్కడ గెలుస్తారనేది ఇప్పటి వరకు చర్చ సాగింది. పోలింగ్ పూర్తయిన తరువాత కూడా జనసేన నేతలు ఎక్కడా తమ నేత గెలుపు పైన స్పందించలేదు. కొంత మంది భీమవరంలో విజయం ఖాయమని చెబితే..మరి కొందరు గాజువాకలో పవన్ గెలుస్తారంటూ చెప్పుకొచ్చారు. అయితే, లెక్కలన్నీ తీసిన తరువాత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల గెలవటం ఖాయమని గట్టిగా చెబుతున్నారు. తాము ఆశించిన దానికంటే వివిధ వర్గాల నుంచి మద్దతు లభించిందని, ముఖ్యంగా మహిళ, యువ ఓటర్లు ఏక పక్షంగా తమ నాయకుడు పవన్కు మద్దతుగా నిలిచా రంటూ ఇప్పుడు లెక్కలు తీయడం ప్రారంభించారు. అయితే, రెండు చోట్ల గెలిస్తే ఎక్కడి నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతారనేది ఆసక్తి కరమే.
ఊహించని ఫలితాలు వస్తాయి..
పోలింగ్ ముందు ఒక విధంగా..ఆ తరువాత మరో విధంగా జనసేన నేతల తీరు కనిపించింది. పోలింగ్ ముగిసిన తరువాత తాము ఎన్ని సీట్లలో గెలుస్తామనే అంశం పైన ఎక్కడా ఆ పార్టీ నేతలు స్పందించలేదు. అయితే, కొద్ది రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లోని నేతలు కొత్త విషయాలను..లెక్కలను ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. ఊహించని ఫలితాలు తాము సాధిస్తున్నామని చెబుతున్నారు. ఇదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం తో పాటుగా తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నిడదవోలు, నరసాపురం వంటి నియోజకవర్గాల్లో గెలుపు ఖాయమంటూ ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, నర్సాపురం లోక్సభ స్థానంతో పాటుగా అమలాపురం, రాజమండ్రి, విశాఖ స్థానాల్లోనూ తమకు అనుకూలంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఇక, తూర్పు గోదావరి జిల్లాలోనూ మొత్తం 19 స్థానాల్లో తాము తొమ్మది నుండి పది స్థానాల వరకు ఖచ్చితంగా ప్రభావం చూపుతామని చెబుతున్నారు.
టీడీపీ..వైసీపీ పై జనసేన ఎఫెక్ట్..
పోలింగ్ పూర్తయిన తరువాత మౌనంగా ఉండీ..ఇప్పుడు జనసేన నేతలు ఈ రెండు జిల్లాల్లో చేస్తున్న హడావుడితో టీడీపీ..వైసీపీ నేతలు తమ లెక్కలను సరి చూసుకుంటున్నారు. జనసేన నేతలు వాస్తవాలకు దగ్గరగా విశ్లేషణ చేస్తున్నారా లేక తమతో పొటీగా లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా అనే ఆందోళన వారిలో మొదలైంది. అయితే , జనసేన ఎఫెక్ట్ తమ పార్టీ మీద దాదాపు 30 సీట్లకు పైగా పడిందని టిడిపి అధినేత స్వయంగా పార్టీ ముఖ్యనేతల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. అదే విధంగా వైసీపీ సైతం దాదాపు 12 నుండి 15 స్థానాల్లో నష్టం జరిగే అవకాశం ఉందంటూ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ మూడు పార్టీల అంచనాలు తేలాలంటే ఈనెల 23వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే..