టీడీపీతో పొత్తు పెట్టుకుందాం: జనసేన సమావేశంలో ప్రతిపాదన: తేల్చని పవన్..!
జనసేన అధినేత పవన్ ముందు పార్టీ నేతలు కొత్త ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు. పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజధాని వ్యవహారంతో పాటుగా..స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవ్వటం పైన చర్చ జరిగింది. ఆ సమయంలో కొందరు నేతల ఆశ్చర్యకంగా కొన్ని కీలక ప్రతిపాదనలు సమావేశంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒంటరి పోరు కంటే కీలక పార్టీతో పొత్తుతో వెళ్లటం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేసారు.
అధికార వైసీపీ.. బీజేపీ కాకుండా ఏ పార్టీతో వెళ్లినా పార్టీకి ప్రయోజనం ఉంటుందని పలువురు ప్రతిపాదించినట్లు సమాచారం. మరి కొందరు టీడీపీతో స్థానిక సంస్థల ఎన్నికలతోనే పొత్తు పెట్టుకోవాలని సూచించారు. అయితే, పార్టీ అధినేత పవన్ మాత్రం దీని పైన తన అభిప్రాయం ఏంటనేది స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో పవన్ సడన్ గా ఢిల్లీ వెళ్లటం ద్వారా ఇప్పుడు జనసేన అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
టీడీపీతో పొత్తు ప్రతిపాదన..
జనసేన పార్టీ కీలక సమావేశంలో అధినేత పవన్ ముందు అనూహ్య ప్రతిపాదనలు వచ్చాయి. పార్టీ ముఖ్య నేతలు హాజరైన ఈ సమావేశంలో రాజధానుల అంశంతో పాటుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహాల మీద చర్చించారు. సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నామని..ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకోవాలని పార్టీ నేతలు ప్రస్తావించారు. ఇందు కోసం ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకోవాలని మరి కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం.
అయితే, అధికార వైసీపీ..బీజేపీతతో కాకుండా ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రయోజనం ఉంటుం దని చెప్పుకొచ్చారు. వామపక్షాలతో కొనసాగుతన్న పొత్తు పైనా ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేసారు. ఆ సమయంలో టీడీపీతో పొత్తు తిరిగి కొనసాగిస్తే వైసీపీని ఎదుర్కోగలుగుతామని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నుండే వైసీపీని దెబ్బ తీయాల్సిన అవసరం ఉందని మరి కొందరు పార్టీ అధినేతకు వివరించారు.
ఎటూ తేల్చిన జనసేనాని..
పార్టీ నేతలు పొత్తుల విషయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు లేని కారణంగానే..నష్టపోయానే మెజార్టీ అభిప్రాయం వ్యక్తం అయింది. దీంతో.. వీరి అభిప్రాయాలను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వినటం మినహా..మరే అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అయితే, పవన్ కళ్యాణ్ విశాఖలో నిర్వహించిన ఇసుక పైన పోరాటం..నిరసన కవాతుకు టీడీపీ మద్దతు ప్రకటించింది. అదే విధంగా ఇసుక అంశం పైన చంద్రబాబు విజయవాడలో చేసిన దీక్షలో జనసేన నేతలు హాజరయ్యారు.
అయినా..రెండు పార్టీల మధ్య అధికారికంగా పొత్తు మాత్రం లేదు. పవన్ తో తిరిగి పొత్తు పెట్టుకోవటానికి టీడీపీ నుండి అభ్యంతరాలు ఉండే అవకాశాలు తక్కవగానే ఉండే అవకాశం ఉంది. ఇక, ఇప్పుడు జనసేన అధినేత పవన్ నిర్ణయం ఆధారంగా దీని పైన తరువాతి అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది.