అమరావతిలో మెగా బ్రదర్ నాగబాబు: ఆందోళన చేస్తున్న రైతులకు అండగా: పవన్ నిర్ణయమేంటి..!
ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన తరువాత అమరావతిలో ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. అక్కడ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు..స్థానికులు రోడ్డెక్కారు. తమను మోసం చేసారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగు మందుల డబ్బాలతో నిరసన కొనసాగిస్తున్నారు. తాము రాజధాని కోసమని భూములు త్యాగం చేస్తే..ఇప్పుడు రాజధాని మారుస్తారా అంటూ బంద్ నిర్వహించారు. ఇప్పటికే టీడీపీ నేతలు వారికి మద్దతుగా నిలిచారు. వారి నిరసనల్లో పాల్గొంటున్నారు.
ఇక, ముఖ్యమంత్రి మూడు రాజధానుల పైన అసెంబ్లీలో చేసిన ప్రకటన పైన జనసేన అధినేత పవన్ సైతం స్పందిం చారు. విశాఖలో ముందుగానే వైసీపీ నేతలు భూములు కొనుగోలు చేసారంటూ స్థానికులు తనకు వివరించారని పేర్కొన్నారు. ఇక, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా జనసేన నేతలు అమరావతి పర్యటనకు వస్తున్నారు. అక్కడి రైతులతో సమావేశం కానున్నారు.
ఏది రియల్..ఏది వైరల్: రాపాక సస్పెన్షన్ పైన మరోసారి: నిజం కాదంటూ..జనసేన..!
రైతులకు మద్దుగా నాగబాబు..
అమరావతిలో ఆందోళనకుకు దిగి..దీక్షలు చేస్తున్న రైతులకు అండగా నిలివాలని జనసేన నిర్ణయించింది. వారిని పరామర్శించి..వారి ఆవేదన తెలుసుకొనేందుకు జనసేన నేతలు..మెగా బ్రదర్ నాగబాబుతో పాటుగా నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలతో కలిసి అమరావతిలో పర్యటించనున్నారు. తమ పార్టీ ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని..అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు.రాజధాని రైతులకు జనసేన పూర్తి సంఘీభావం తెలుపుతుందని.. సీఎం జగన్ రాజధానిపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కమిటీ రిపోర్టు ఇవ్వకుండానే ప్రకటనలు చేయడం కరెక్టు కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు.
జగన్..సాయిరెడ్డికి ఆర్దిక లబ్దికోసమే..
ఇక, పార్టీ నేతల పోతిన మహేశ్ ముఖ్యమంత్రి పైన కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్..విజయ సాయిరెడ్డి ఆర్దిక లబ్ది కోసమే రాజధాని మార్పు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఎమ్మెల్యే రాపాక ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు ఇచ్చేలా వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో అమరావతి ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు రైతులకు మద్దతుగా నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు జనసేన నేతలు ఇక్కడి స్థానికులు..భూములు ఇచ్చిన రైతుల అభిప్రాయాలను అధినేత పవన్ కళ్యాణ్ ను వివిరించనున్నారు. అదే సమయంలో ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ సైతం నివేదిక సమర్పించనుంది.
పవన్ నిర్ణయమేంటి..
గతంలో రాజధాని రైతులకు మద్దతుగా జనసేన అధినేత పవన్ అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రైతులకు మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రైతుల నుండి బలవంతంగా భూములు తీసుకుంటే సహించేది లేదని స్పష్టం చేసారు. ఇప్పుడు అదే రైతులు..తాము భూములిచ్చి..రాజధాని మారిస్తే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, పవన్ మాత్రం కమిటీ నివేదికలో ఏం సూచనలు చేసారు.. ప్రభుత్వ ఆలోచనలు ఏంటి అనే అంశం పైన స్పష్టత వచ్చిన తరువాతనే అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే నినాదంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.