జనసేనాని చూపు బీజేపీ వైపు ? అదే జరిగితే చిరంజీవికి, పవన్ కు తేడా ఏంటి? ఏపీలో జోరుగా చర్చ
Recommended Video
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూపు బీజేపీ మీద పడిందా ? బీజేపీతో కలిసి ముందుకు సాగాలని జనసేనాని నిర్ణయం తీసుకున్నారా ? అమెరికాలో తానా మహాసభల సందర్భంగా రామ్ మాధవ్ తో భేటీ అయిన పవన్ కళ్యాణ్ అప్పుడే ఈ విషయం గురించి చర్చించారా ? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్తే తప్ప పార్టీని బతికించుకోవడం కష్టం అనే నిర్ణయానికి వచ్చినట్టు ఏపీలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.గత ఎన్నికల్లో ఓటమి పాలైన జనసేన రాష్ట్రంలో తిరిగి బలోపేతం కావాలి అంటే బీజేపీతో కలిసి పని చేస్తే బాగుంటుంది అన్న భావన పవన్ కళ్యాణ్ కు ఉందని తెలుస్తోంది.
జనసేనలో ఏమి జరుగుతోంది..? దళిత ఎమ్మెల్యే పై పార్టీ వివక్ష చూపుతోందా?
బీజేపీతో కలిసి వెళ్తే ఎలా ఉంటుందని పార్టీ నేతలతో చర్చిస్తున్న పవన్ కళ్యాణ్
గత రెండు రోజులుగా అమరావతి పార్టీ ప్రధాన కార్యాలయంలో పలు పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని నేతల వద్ద పరోక్షంగా ప్రస్తావనకు తెస్తున్నట్లుగా సమాచారం. ఒక పక్క రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించి చాలా స్ట్రాంగ్ గా ఉన్న వైసీపీని ఢీకొనాలంటే బిజెపి సహకారం అవసరమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట.అందుకే బీజేపీ ప్రస్తావన ముఖ్య నేతల వద్ద పవన తెస్తున్నారని టాక్ .
బీజేపీలో జనసేన పార్టీ విలీనం చెయ్యాలని రాం మాధవ్ ప్రతిపాదన
ఇటీవల అమెరికాలో తానా సభల సందర్భంగా కలిసిన పవన్ కళ్యాణ్ రామ్ మాధవ్ ల మధ్య భేటీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అప్పుడు గతంలో ఉన్న స్నేహం దృష్ట్యా కలిశామని ఇందులో ఎలాంటి రాజకీయ కారణాలు లేవని చెప్పిన నేతల మధ్య రాజకీయ పరమైన అంశాల మీద చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ను బిజెపిలో విలీనం చేస్తే బాగుంటుందనే ప్రతిపాదనను రామ్ మాధవ్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ విషయంపై పార్టీ నాయకులు విలీనం మంచిది కాదని పవన్ కళ్యాణ్ కు సూచించారని సమాచారం.
ఎందుకంటే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి, ఎన్నికల్లో పోటీ చేసి 2009 ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పటికీ ఆయన ఊహించని విధంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇక ఆ దెబ్బ ప్రస్తుతం జనసేన పార్టీ మీద గట్టిగానే పడింది.
జనసేన మీద ఇప్పటికే ప్రజా రాజ్యం ఎఫెక్ట్ ... బీజేపీ విషయంలో పవన్ అంతర్మధనం
చిరంజీవిని ఎంతో నమ్మి 18 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టిన ఏపీ ప్రజలు చిరంజీవి తీసుకున్న నిర్ణయంతో షాక్ తిన్నారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అదే తరహాలో రాజకీయ పార్టీ పెట్టడంతో అన్నలాగే తమ్ముడు కూడా చేస్తాడన్న భావనతో పవన్ కు ఎంత మంచి విజన్ ఉన్నప్పటికీ పవన్ పార్టీ ని ఏపీ ప్రజలు ఆదరించడానికి సంశయిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో చిరంజీవిలా నిర్ణయం తీసుకుంటే అది పవన్ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. కాబట్టి ఈ నిర్ణయం కరెక్ట్ కాదని అభిప్రాయం పార్టీ శ్రేణులలోనూ, ప్రజలలోనూ ఉంది.
గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమిపై అంతర్మధనంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొత్తుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనే భావన వ్యక్తం అవుతుంది.
స్నేహంగా ఉండటం ఓకే .. కానీ బీజేపీతో పొత్తు అవసరం లేదంటున్న జనసైన్యం
పవన్ ముందు పార్టీ విషయంలో ఇప్పటికీ ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ ను దూరం చేయాల్సిన అవసరం ఉంది. రోజుకో రకమైన నిర్ణయాలతో కాకుండా, ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రస్తుత ఏపీ లో జరుగుతున్న చర్చ. బిజెపితో స్నేహ పూర్వకంగా ఉండటం తప్పు లేదు కానీ ప్రస్తుతానికి పొత్తు కూడా అవసరం లేదనే భావన జనసేన అభిమానులలో వ్యక్తమవుతోంది. ఇక ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని జనసేన నేతలు, అభిమానులు భావిస్తున్నారు.