జాతీయ సర్వేల్లో ఊసే లేని జనసేన ..పవన్ కళ్యాణ్ పార్టీ ఆశలు గల్లంతేనా ?
Recommended Video
ఏపీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండొచ్చు అంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు జనసేనను జీరోగా చూపించాయి . ఏడోదశ ఎన్నికలు ముగిసిన వెంటనే పలు జాతీయ సర్వే సంస్థలు వెల్లడించిన ఫలితాల్లో జనసేన ఆశలపై నీళ్ళు చల్లాయి. ఒక పక్క కింగ్ మేకర్ అవుతామని కలలు కన్న జనసైన్యం అంత సినిమా లేదని అటు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు తేల్చేయటంతో ఖంగు తిన్నారు.
Exit Poll.. ఏ సర్వే ఏం చెప్పింది..: జగన్కు చంద్రబాబు గట్టి పోటీ, కేసీఆర్ ఆశలు గల్లంతు!
ఏపీలో కింగ్ మేకర్ అనుకున్న జనసేన .. నో ఛాన్స్ అన్న జాతీయ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్
ఎన్నికలు ముగిసినప్పటి నుంచి జనసేన పార్టీ వర్గాలు తమ పార్టీ ఏపీలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషిస్తుంది అని ధీమాతో ఉన్నారు . అయితే సర్వే సంస్థల గణాంకాలు మాత్రం జనసేన ప్రభావం ఏ మాత్రం లేదన్నట్టుగా సూచించాయి. పలు జిల్లాల్లో ప్రభంజనం సృష్టిస్తుంది అని జనసేన వర్గాలు భావించినప్పటికీ కొన్ని సర్వే సంస్థలైతే కనీసం పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తారని చెప్పలేదు. ఇక భీమవరం నుండి , గాజువాక నుండి ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ భీమవరంలో గెలిచే అవకాశం వుందని గాజువాకలో ఓటమి పాలయ్యే సూచన వుందని లగడపాటి సర్వేలో వెల్లడించారు. మరో పక్క నర్సాపురం నుండి ఎన్నికల బరిలోకి దిగిన నాగబాబు విజయం సాధిస్తారని జనసైన్యం చాలా నమ్మకంతో ఉంటే జాతీయ సర్వేలు జనసేనకు ఒక్క లోక్ సభ స్థానం కూడా వస్తుందని చెప్పలేదు. మొత్తంగా జనసేనకు అసలు ఏ మాత్రం ప్రాధాన్యం లేదన్నట్టు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి .
జనసేన విషయంలో సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో ఏం చెప్పాయంటే
అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన లగడపాటి రాజగోపాల్ ఫ్లాష్ టీమ్ జనసేన రెండు నుంచి మూడు సీట్లకు అటు ఇటుగా వస్తాయని తేల్చింది. అలాగే జనసేనకు 11 శాతం ఓట్లు పడ్డాయని పేర్కొంది. జనసేనకు ఒక లోక్ సభ స్థానం కూడా వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది . ఇక జాతీయ సర్వేలు జనసేనను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. ఎంపీ సీట్ల అంచనాకే పరిమితమైన జాతీయ మీడియా సంస్థలన్నీ టీడీపీ, వైసీపీ సీట్లనే పరిగణలోకి తీసుకున్నాయి. జనసేనకు ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. మరోవైపు అటు జాతీయ సర్వేల్లో పార్లమెంట్ స్థానాలకు సంభంధించి ఇండియా టుడే - మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనాలో వైసీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని తేల్చితే, టీడీపీకి 4-6 సీట్లు వస్తాయని తేల్చింది. అయితే జనసేనను పరిగణలోకి తీసుకోలేదు. అలాగే టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ లో కూడా వైసీపీకి 18 సీట్లు, టీడీపీకి 7 సీట్లు వస్తాయని తేల్చింది.
పవర్ స్టార్ పవర్ చూపిస్తారా .. ఎగ్జాక్ట్ పోల్స్ తీర్పు ఏంటి ..
అయితే జాతీయ సర్వేల్లో జనసేన ఊసే లేకపోవడం శ్రేణుల్లో కాస్త ఆందోళన కలిగించే అంశంగా మారింది. దీంతో జనసేన శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. మరోవైపు తమకు సైలెంట్ ఓటింగ్ పడిందని, మే 23 ఫలితాల తర్వాతే స్పందిస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. జన్సేన మాత్రం తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ తో ఏ మాత్రం ఏకీభవించటం లేదు. ఎగ్జాక్ట్ పోల్స్ చూసాక స్పందిస్తామంటున్న జనసేన అధినేత పవర్ స్టార్ తన పవర్ చూపించి పవర్ ఫుల్ గా నిలబడతారో .. లేకా పరువు పోగొట్టుకుంటారో తెలియాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.