పవన్ కు జనసేన ఎమ్మెల్యే కొత్త ట్విస్ట్ : అధినేత అభిప్రాయానికి భిన్నంగా: జగన్ నిర్ణయానికి మద్దతుగా..
Recommended Video
ఏపీ శాసనసభలో జనసేన ఎమ్మెల్యే కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న ఇంగ్లీష్ మీడియాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో వదిలేసిన ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోందని రాపాక చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల మీద రాపాక స్పందించారు. సభలో ఎవరైనా స్పీకర్ ను గౌరవించాల్సిందేనని స్పష్టం చేసారు. అదే సమయంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు సైతం ఎవరూ చెప్పాల్సిన అవసరం రాకూడదన్నారు.
జగన్ నిర్ణయానికి మద్దతుగా..
శాసనసభ వేదికగా జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే మాతృభాష అన్యాయానికి గురవుతుందని ఇప్పటికే పలుమార్లు చెబుతూ వచ్చారు. ప్రభుత్వం తొలుత ప్రజా సమస్యలను పరిష్కరించి తరువాత ఆంగ్ల మాధ్యమంపై దృష్టి సారించాలని జగన్ సర్కార్పై పవన్ విరుచుకుపడుతుంటే, జనసేన ఎమ్మెల్యే రాపాక మాత్రం ఇంగ్లీష్ మీడియాన్ని ఏక పక్షంగా స్వాగతించడంతో జనసేన శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇంగ్లీష్ మీడియాన్ని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం మధ్యలో వదిలేసిన ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ ప్రభుత్వం కొనసాగించే ప్రయత్నం చేస్తోందని రాపాక చెప్పారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు.
పవన్ అభిప్రాయానికి భిన్నంగా...
తమ పార్టీ అధినేత పవన్ కళ్యాన్ అభిప్రాయానికి భిన్నంగా సొంత పార్టీ ఎమ్మెల్యే ఏకంగా సభలోనే ముఖ్యమంత్రి నిర్ణయానికి ఏకపక్షంగా మద్దతు ప్రకటించారు. అందునా చంద్రబాబు నిర్ణయాన్నే జగన్ కొనసాగిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. దీని ద్వారా జగన్ తీసుకున్న నిర్ణయం తప్పు కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో వైసీపీ సభ్యులతో కలిసి చంద్రబాబు స్పీకర్ ఛైర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పు బట్టారు. ఆయన ఆ వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసారు. దీంతో..ఒక్క సారిగా టీడీపీ నేతలు విస్తుపోయారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ నవ్వతూ సభలో కనిపించారు. అసెంబ్లీ లాబీల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
గతంలోనూ వైసీపీపై ప్రశంసలు..
జనసేన నుండి కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. పార్టీ వాయిస్ ఆయన సభలో వినిపించాల్సి ఉంది. ఈ సమయంలో ఆయన తొలి నుండి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం నెలకొని ఉంది.గతంలో వైసీపీ సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కూడా ఎమ్మెల్యే రాపాక అధికార పార్టీపై ప్రశంసల వర్షం కురింపించారు. కొద్ది రోజుల క్రితం మంత్రి విశ్వరూప్ తో కలిసి సీఎం జగన్ కు పాలాభిషేకం చేసిన సమయంలోనూ రాకాప పాల్గొన్నారు. ఇది అప్పట్లోనే చర్చకు కారణమైంది. అయితే, రాపాక ఇప్పుడు జనసేనలోనే ఉంటూ..వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ..దీని పైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ రకంగా వ్యవహరిస్తారనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కర చర్చకు కారణమైంది.