ప్రశ్నిస్తే కేసులా: ‘జనసేన’కు ముస్లిం ఐక్యవేదిక ప్రశ్న
విజయవాడ: గుంటూరు జిల్లా చినకాకానిలో రాష్ట్ర కార్యాలయం కోసం జనసేన పార్టీ లీజుకు తీసుకున్న స్థలం వివాదం కొనసాగుతూనే ఉంది. జనసేన కార్యాలయానికి భూమి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లిం ఐక్య వేదిక నాయకులు.. ఆధారాలతో శనివారం మీడియా ముందుకొచ్చారు.
ఈ సందర్భంగా ముస్లిం ఐక్య వేదిక నేత జలీల్ మాట్లాడుతూ.. జనసేన పార్టీతో మాకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. ముస్లిం నేతలను దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తమభూముల్ని ఎందుకు తీసుకున్నారని అడిగితే కేసులు పెడతారా? అని జలీల్ ప్రశ్నించారు.
ఈ స్థల వివాదమై 1997లో గుంటూరు కోర్టు తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని, అనంతరం యార్లగడ్డ సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ప్రస్తుతం కేసు అక్కడ పెండింగ్లో ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే యార్లగడ్డ సుబ్బారావు వారసులు యార్లగడ్డ సాంబశివరావు తదితరులు సదరు స్థలాన్ని జనసేన పార్టీ కార్యాలయ నిర్మాణానికి లీజుకు ఇచ్చిన విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని చెప్పారు.
కాగా, ఇటీవలే స్థల వివాదంప పవన్ స్పందించారు. త్వరలోనే న్యాయ నిపుణులతో కలిసి జనసేన ప్రతినిధులు చినకాకాని వస్తారని, భూ యజమానులు తమ డాక్యుమెంట్లు వారికి ఇవ్వాలని ఓ ప్రకటనలో సూచించారు.
స్థలం ముస్లింలదేనని నిర్థారణ అయితే జనసేన ఆ స్థలానికి దూరంగా ఉంటుందని హామీ ఇస్తున్నట్టు పవన్ స్పష్టం చేశారు. ఈ స్థలాన్ని కేవలం మూడున్నర సంవత్సరాలకు మాత్రమే జనసేన లీజుకు తీసుకుందని, అందువల్ల ఈ స్థలం విషయంలో దురుద్దేశాలు లేవని పవన్ వివరణ ఇచ్చారు.