అచ్చెన్నాయుడు అరెస్ట్ పై జనసేన డౌట్స్- అసెంబ్లీకి ముందు అరెస్ట్- నిబంధనల ఉల్లంఘనే..
టీడీపీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంపై జనసేన పార్టీ ఆచితూచి స్పందించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సరిగ్గా మూడు రోజుల ముందు అచ్చెన్నాయుడును అరెస్టు చేయడం అనుమానాలకు తావిచ్చేలా ఉందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తాజా ప్రెస్ నోట్లో తెలిపారు.
అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా, కక్షసాధింపుకా అన్న విషయంలో వైసీపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మనోహర్ డిమాండ్ చేశారు.
అవినీతి ఏ రూపంలో ఉన్నా జనసేన పార్టీ వ్యతిరేకిస్తుందని, అయితే అసెంబ్లీ సమావేశాలకు ముందు అరెస్టు చేయడంపై మాత్రం సందేహాలకు తావిస్తోందని మనోహర్ తెలిపారు. అదే విధంగా ఓ శాసనసభ్యుడిని అరెస్టు చేసే ముందు రాజ్యాంగ నిబంధనలను పాటించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు.
అచ్చెన్నాయుడు అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తోందని జనసేన నేత మనోహర్ ఆక్షేపించారు. ఈఎస్ఐలో జరిగిన అక్రమాలతో పాటు ఇప్పటివరకూ జరిగిన అన్ని అక్రమాలపైనా దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్ చేస్తోందని మనోహర్ అన్నారు.