'2019లో రెండు రాష్ట్రాల్లో పోటి.. లెఫ్ట్ పార్టీలతో పొత్తు!, పార్టీ బలోపేతంపై ఫోకస్'
పొత్తుల గురించి ప్రస్తావిస్తూ.. క్షేత్రస్థాయిలో బలమైన కార్యవర్గం ఉన్న లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లే విషయమై ఆలోచిస్తామని అన్నారు.
హైదరాబాద్: జనసేన పార్టీ స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. మూడేళ్లు గడిచినా.. పార్టీకంటూ సొంత కేడర్ లేకపోవడం.. పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం.. జనసేన రాజకీయ ఉనికిపై ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాటిపై స్పందించారు. పార్టీ బలోపేతానికి ప్రణాళికలు సిద్దం చేయడంతో పాటు వచ్చే 2019ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోను పోటీ చేస్తామని పవన్ స్పష్టం చేశారు. 32సమస్యలపై పోరాడాల్సిందిగా ప్రజల నుంచి తమకు డిమాండ్ వచ్చినట్లు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తానని పవన్ స్పష్టతనిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రాధాన్యతనిస్తామని, ముఖ్యంగా పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని పవన్ చెప్పారు. పార్టీలో యువతను చేర్చుకునే విషయమై ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీకి యువ నాయకత్వం కావాల్సిన అవసరముందని తెలిపారు.
వచ్చే ఎన్నికల నాటికి పార్టీకంటూ సొంత నాయకత్వం రూపొదిద్దుకోవాలని, సొంతంగా నిలదొక్కుకునే స్థాయికి పార్టీ రావాలని పవన్ ఆకాంక్షించారు. ఇందుకోసం సమర్థవంతమైన నాయకత్వం కోసం అన్వేషిస్తున్నామని పవన్ అన్నారు. ఇక పొత్తుల గురించి ప్రస్తావిస్తూ.. క్షేత్రస్థాయిలో బలమైన కార్యవర్గం ఉన్న లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లే విషయమై ఆలోచిస్తామని అన్నారు.
రాజకీయాల అంతిమ లక్ష్యం అధికారమే కాకూడదని, 60శాతం సీట్లు యువకులకే కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారుఇక రాష్ట్రంలో పాలన గురించి చెబుతూ.. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నేత ఏపీకి కావాలని, అయితే ప్రభుత్వ పథకాలు సరిగ్గా జనాల్లోకి వెళ్లట్లేదని అభిప్రాయపడ్డారు.ఇక తాజా యూపీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. కుటుంబ కలహాలతోనే యూపీలో అఖిలేష్ ఓడిపోయారని అన్నారు. తన అన్న చిరంజీవి జనసేన పార్టీలోకి వచ్చే అవకాశం లేదన్నారు.