జనసేన లేకుంటే.. టీడీపీ, వైసీపీలు కచ్చితంగా అదే చేసేవి: పవన్ కల్యాణ్
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ కనుక ఆవిర్భవించకపోయి ఉంటే టీడీపీ, వైసీపీలు కలిసి రాష్ట్రంలోని ఊళ్లను కచ్చితంగా పంచుకుని ఉండేవని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పోరుయాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలోని సాలూరు, గజపతినగరంలో పర్యటిస్తున్న జనసేన చీఫ్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
టీడీపీ అవినీతిపై తాను చేసిన ఆరోపణల పట్ల ఆ పార్టీ చేస్తున్న సవాళ్లకు పవన్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి జరిగినట్టు నిరూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాలు చేస్తున్నారని, లంచాలు తీసుకునే వారు రసీదులు ఇస్తారా? అని ప్రశ్నించారు.
ఎవడబ్బ సొమ్ము?, బాబును కూడా ఇవే నీళ్లు తాగమనండి: నిప్పులు చెరిగిన పవన్!
ఇక స్థానిక టీడీపీ నేతలను పవన్ టార్గెట్ చేశారు. గిరిజనుడు కాని భాంజ్దేవ్ను టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారని, రైతుల పొలాలకు అందాల్సిన సాగునీటిని ఆయన చేపల చెరువులకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు.
అంగన్వాడీ పోస్టులను సైతం టీడీపీ నాయకులు లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు అధికారులపై జులుం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 2019లో ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పవన్ స్పష్టం చేశారు.