వలస కూలీలను చిదిమేసిన రైలు.. రాష్ట్రాలకు బాధ్యతలేదా? అంటూ పవన్ కల్యాణ్ ఫైర్
విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విమానాల్లో తరలిస్తున్నవేళ.. వలస కూలీలు మాత్రం దిక్కులేని పక్షుల్లా తిరుగుతోన్న వైనం అందరినీ కంటతడిపెట్టిస్తున్నది. వేరే రాష్ట్రాల్లోని వలస కూలీలను సొంత ప్రాంతాకు తరలించేందుకు కేంద్రం ప్రత్యక రైళ్లు ఏర్పాటుచేసినా.. ఆ ఖర్చును రాష్ట్రాలే భరించాలని మెలికపెట్టడంతో వ్యవహారం గందరగోళంగా మారింది. ఈలోపే మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ ఘటనపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అనూహ్య కామెంట్లు చేశారు.
Recommended Video
అందుకే ఇలాంటి ప్రమాదాలు: విశాఖ గ్యాస్ లీకేజీపై రాజకీయాలు వద్దంటూ పవన్ కళ్యాణ్
మహారాష్ట్రంలోని జల్నాలో పనిచేస్తోన్న వలస కూలీల బృందం.. మధ్యప్రదేశ్ లోని సొంత ఊళ్లకు వెళ్లేందుకు రైలు పట్టాలవెంట నడకబాటపట్టారు. లాక్ డౌన్ కారణంగా రైళ్లు కూడా పూర్తిగా బంద్ అయిపోయాయనే భ్రమలో ఉన్న కూలీలు.. రాత్రి వేళ అసలట తీర్చుకునేందుకు రైలు పట్టాలపైనే పడుకున్నారు. తెల్లవారి 5 గంటల సమయంలో ఓ గూడ్స్ రైలు వాళ్లను చిదిమేసింది. 20 మంది కూలీల్లో 16 మంది చనిపోగా, నలుగురు చికిత్సపొందుతున్నారు. ఈ ఘటనపై సర్వత్రా స్పందనలు వెలువడ్డాయి.
ఔరంగాబాద్ రైలు ప్రమాదంపై జనసేన చీఫ్ పవర్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వాలే ఆదుకోవాలని కోరారు. వలస కూలీల తరలింపు కోసం కేంద్రం శ్రామిక్ రైళ్లు నడుపుతున్నప్పటికీ, వాటికి సంబంధించిన సమన్వయాన్ని, రైళ్ల సమాచారాన్ని కూలీలకు చేరవేయడంలోగానీ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అనడానికి ఔరంగాబాద్ పెను ప్రమాదమే ఉదాహరణ అని పవన్ మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వాలు బాధ్యతగా మెలగాలన్నారు.