రూటు మారుస్తున్న పవన్- విద్వేష ప్రచారంపై చర్యలు- మీడియా, సోషల్ మీడియాపై దృష్టి...
ఏపీలో 2024 నాటికి మిత్రపక్షం బీజేపీతో కలిసి అధికారంలోకి వస్తామని గతేడాది ప్రకటించిన జనసేనకు అప్పటి నుంచి ఎదురుదెబ్బలు తప్పలేదు. పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకి మద్దతు ప్రకటించడంతో ఇక సోషల్ మీడియాలో ఆ పార్టీకి ట్రోలింగ్ ఎక్కువైపోయింది. అధికార వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తే చాలు ఆయన వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. దీంతో ఈ విద్వేష ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు జనసేన సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ జనసేన కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు- పవన్ కళ్యాణ్ పతాకావిష్కరణ
జనసేనపై విద్వేష ప్రచారం...
2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్ధాపించిన పవన్ కళ్యాణ్ అప్పటి ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో టీడీపీ ఎన్డీయే నుంచి తప్పుకున్నాక ఆ పార్టీ అజెండాకు అనుకూలంగా బీజేపీపై ఎదురుదాడి చేశారు. చివరికి 2019 ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత తిరిగి బీజేపీతో కలిసిపోయారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వేసిన తప్పటడుగుల కారణంగా అధికారానికి దూరమయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ గతాన్ని వీడి భవిష్యత్తువైపు అడుగులేస్తున్న తరుణంలో ప్రత్యర్ధులు ఆయనపై సోషల్ మీడియాలో సాగిస్తున్న విద్వేష ప్రచారం శృతిమించుతోంది. నిత్యం పవన్ను ట్రోల్ చేస్తూ సాగుతున్న ఈ ప్రచారాన్ని ఇప్పటివరకూ జనసేన లైట్ తీసుకుంది. కానీ తాజాగా ఇది పరాకాష్టకు చేరడంతో దీనిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఎదురుదాడి వ్యూహం...
సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్ధులు సాగిస్తున్న విద్వేష ప్రచారానికి ఎక్కడిక్కడ కౌంటర్లు వేయాలని జనసేన నిర్ణయించింది. ఇకపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వచ్చే ట్వీట్లు, ట్ర్లోల్స్పై స్పందించేందుకు పార్టీలో కౌంటర్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ఎప్పటికప్పుడు వీటిని గమనించడంతో పాటు వాటికి పార్టీ నేతలతో కౌంటర్లు ఇప్పించేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటివరకూ సంయమనంతో వ్యవహరించామని, కానీ ఇది జనంలో తప్పుడు సంకేతాలు పంపుతున్న నేపథ్యంలో ఎదురుదాడికి సిద్ధమవుతున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. పార్టీ విధానాలను జనంలోకి తీసుకెళ్లడంతో పాటు వీటిపై విమర్శలు చేసే వారిపై ఎదురుదాడి కొనసాగించాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
చట్టపరమైన చర్యలు...
మీడియాతో పాటు సోషల్ మీడియాలో జనసేన పార్టీపై కుట్రపూరితంగా సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, చట్ట పరిధిలో చర్యలు చేపట్టడానికి వీలుగా జనసేన పెద్దలు కొందరు సీనియర్ న్యాయవాదులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీకి తెలియచేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇదంతా చూస్తే ఇప్పటివరకు సంయమనంతో వ్యవహరించిన పార్టీ నాయకత్వం ఇక నుంచి తీవ్రస్థాయిలోనే- మీడియా సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై దృష్టి పెట్టి, ఎదురుదాడికి సమాయత్తమవుతున్నట్లు అర్థమవుతోంది. తాజాగా టీవీ 9 ఛానల్కు రాసిన లేఖ అందులో భాగమేననని పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ఒకరు తెలిపారు.