ఏపీకి రాజధాని లేకుండా చేస్తారా.. జగన్ పాలన అస్తవ్యస్థం: పవన్ తాజా నిర్ణయాలివే...!
ఏపీలో ముఖ్యమంత్రి జగన్ పాలనతో అన్ని వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయని జనసేన అధినేత పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అన్ని తిరోగమనం దిశగా వెళ్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్కు అనేక రాజధానులు పెడతారా.. పిల్లి కాపురంలో పిల్లల్ని ఆరు చోట్లకు మార్చిందన్న చందాన రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ చివరకు ఏమీ లేకుండా చేస్తారేమో అంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఇసుక లభ్యత లేక రాష్ట్రంలో 35 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారని ఫైర్ అయ్యారు. సచివాలయ పోస్టుల నియామకాల్లో తప్పిదాలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పించారు. లోపభూయిష్టమైన మద్యం విధానంతో భారీస్థాయి అవినీతికి తెర తీసిందని ఆరోపించారు. ఇదే సమయంలో అనేక సమస్యల పైన పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను ఖరారు చేసారు.
ఆంధ్ర ఆర్థిక పరిస్థితి.. అతలాకుతలం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో అనేక అంశాల మీద చర్చించారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ పాలన పూర్తిగా వైఫల్యం చెందిందనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తం అయింది. ఏపీకి రావలసిన రాబడులు కోల్పోతూ ఆర్థిక వ్యవస్థ కుంటుపడితే అభివృద్థి ఏ విధంగా జగన్ ప్రభుత్వాన్ని పోలిట్ బ్యూరో ప్రశ్నించింది. కొత్త ఇసుక విధానం పేరుతో నిర్మాణ రంగాన్ని, అందుకు అనుబంధంగా అన్ని వ్యవస్థల్ని తిరోగమన దిశలోకి జగన్ ప్రభుత్వం తీసుకెళ్లిందని పొలిట్బ్యూరో మండిపడింది. ఇసుక లభ్యత లేక రాష్ట్రంలో 35 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని సమావేశంలో అభిప్రాయ పడ్డారు. అందుబాటులో ఉన్న ఇసుకను సైతం భారీ ధరలకు విక్రయిస్తుండడంతో నిర్మాణదారులు తమ నిర్మాణాలను నిలిపివేసే పరిస్థితి నెలకొందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు.
రాజధాని లేకుండా చేస్తారా..
రాజధాని విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టిస్తున్నదని జనసేన అభిప్రాయ పడింది. ఎక్కడైనా ఒకటే రాజధాని ఉంటుంది.. కానీ ఆంధ్రప్రదేశ్కు అనేక రాజధానులు పెడతారా? పిల్లి కాపురంలో పిల్లల్ని ఆరు చోట్లకు మార్చిందన్న చందాన రాజధాని అక్కడ.. ఇక్కడ అంటూ చివరకు ఏమీ లేకుండా చేస్తారేమో అని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. గ్రామ సచివాలయ పోస్టుల నియామకాల్లో చోటు చేసుకున్న గందరగోళాలు, నియామకాల్లో తప్పిదాల వల్ల ప్రతిభావంతులైన నిరుద్యోగ యువతలో నిరాశానిస్పృహలు నెలకొన్నాయని తెలిపింది. ఇప్పుడు ఏపీపీఎస్సీలో మార్పులు పేరుతో రాత పరీక్షతోనే నియామకాలంటే.. పేపర్ లీకేజ్ లాంటి అక్రమాలు తలెత్తితే ప్రతిభావంతులు అన్యాయమైపోతారనే ఆందోళన యువతలో నెలకొందని పేర్కొంది. ఉద్యోగ నియామకాల్లో యూపీఎస్సీ మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వానికి సూచన చేసింది.
కేసీఆర్ పరిష్కరించాలి..
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు జనసేన పొలిట్బ్యూరో మద్దతు ప్రకటించింది. సమావేశం ప్రారంభంలోనే ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు ఆర్టీసీ కార్మికులకు నివాళులు అర్పించింది. సమ్మెలో పాల్గొంటున్న 48 వేల మందిని తొలగిస్తామని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన మూలంగా కార్మికుల కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని సూచించింది. కేసీఆర్ స్వయంగా ఈ సమ్మెకు తెరదించేలా పరిష్కరించాలని కోరింది. పూర్వ నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతాల్లోని యురేనియం తవ్వకాల మూలంగా జరిగే పర్యావరణ విధ్వంసం, జరిగే నష్టాలు ఆందోళనకరమైనవనీ, వీటిపై అందరికీ అర్థమయ్యేలా కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి చెప్పాలని నిర్ణయించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం
దేశ సమగ్రతను కాపాడేలా యువతను ఒక శక్తిలా రూపుదిద్దాలని పొలిట్బ్యూరో నిర్ణయించింది. జమ్మూకశ్మీరును జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న చర్యలను పొలిట్బ్యూరో సమర్థించింది. కాగా.. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యంపైనా లోతుగా చర్చించింది.
సరళమైన మార్గంలో వ్యాపారం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) చేసుకునే అవకాశాలు కల్పించాలని.. రోడ్డు పక్కన జరిగే చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద పరిశ్రమల వరకు సులభతరమైన పద్ధతుల్లో అనుమతులు లభించే విధంగా వ్యవస్థకు రూపకల్పన చేయాలని.. అనుమతుల కోసం సింగిల్ విండో విధానం తేవాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పోటీకి సన్నద్ధమేనని పొలిట్బ్యూరో స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై రామ్మోహన్రావు అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ తన నివేదికను పొలిట్ బ్యూరోకు అందజేసింది. అలాగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుల సంఖ్యను పెంచాలని పొలిట్బ్యూరో నిర్ణయించింది.