జగన్ దూకుడును అడ్డుకొనేదెలా: వలసలను ఆపేదెలా..నేటి సమావేశంలో: జనసేనాని సమర్ధతకు పరీక్ష..!
ఏపీ రాజకీయాల్లో దూకుడుగా వచ్చిన జనసేన రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుంది. పార్టీలో రాగానే కీలక స్థానాలు దక్కించుకున్న అనేక మంది నేతలు వలస బాట పట్టారు. మరో వైపు ఏపీలో టీడీపీ ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకొని రాజకీయాలు చేస్తోంది. బీజేపీ సైతం టీడీపీతో పోటీ పడుతోంది. కానీ, జనసేన మాత్రం కార్యక్షేత్రంలోకి రావటం లేదు. అధినేత ట్వీట్లు..ప్రెస్ నోట్ ల ద్వారా మాత్రమే తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కల్కి భగవాన్ ఆశ్రమంలో డ్రగ్స్ దొరికాయా?
పవన్ మినహా పార్టీలో వాయిస్ వినిపించే వారే కరువయ్యారు. పార్టీ నుండి నేతలు వెళ్లిపోతున్నా..మౌనంగా చూడటం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. క్షేత్ర స్థాయిలో బలమైన అభిమాన..అనుచర గణం ఉన్నా పార్టీ బలోపేతం దిశగా చర్యలు లేవు. ఇదే సమయంలో జనసేన నుండి నేతలు అటు వైసీపీ..ఇటు బీజేపీ బాట పడుతున్నారు. ఏపీలో మారుతున్న సమీకరణాల మధ్య ఏ రకంగా ముందుకెళ్లాలనే అంశం పైన చర్చించేందుకు జనసేన పాలిట్ బ్యూరో సమావేశం అవుతోంది. ఈ సమావేశం పార్టీ భవిష్యత్ కు కీలకం కానుంది.
నేడే పాలిట్ బ్యూరో సమావేశం..
ఎన్నికల ఫలితాల తరువాత ఊహించని విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ నేతల మధ్యకు వచ్చారు. ఓటమి కుంగదీయదని చెప్పుకొచ్చారు. అదే సమయంలో కేడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేసారు. కానీ, మరో వైపు జరుగుతున్న పరిణామాలు పవన్ సమర్ధతకు పరీక్షగా మారాయి. అందులో భాగంగా వరుసగా కీలక నేతలు వైసీపీ..బీజేపీ బాట పడుతున్నారు. పవన్ తన పార్టీలోకి వచ్చిన ముఖ్యులకు నమ్మి కీలక బాధ్యతలు అప్పగించారు. వారిలో అనేక మంది ఇప్పటికే పార్టీ వీడారు. జనసేనకు కీలక పట్టు ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లోకి ముఖ్య నేతల మీద ముఖ్యమంత్రి జగన్ ఫోకస చేసారు. జనసేనలో ఉన్న వారిని తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వలసలు వెళ్తున్న నేతలను నియంత్రించటం ఇప్పుడు జనసేనకు పరీక్షగా మారింది.
పవన్ వాయిస్ మినహా..అదీ కూడా..
రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కోసం టీడీపీ..బీజేపీ పోటీ పడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ సమావేశాలు..విమర్శల ద్వారా వేడి పుట్టిస్తోంది. బీజేపీ పాదయాత్రల ద్వారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ..ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, ఈ పోటీలో జనసేన వెనుకబడి ఉంది. ప్రభుత్వ విధానాలు...నిర్ణయాల మీద పార్టీ అధినేత పవన్ మినహా స్పందించే నేతలు పార్టీలో ఎవరూ కనిపించటం లేదు. పవన్ సైతం ట్వీట్లు..ప్రెస్ నోట్ల ద్వారా మాత్రమే తన అభిప్రాయాలు చెప్పేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసేనలోని అధికార ప్రతినిధులు నోరు విప్పటం లేదు. పార్టీలో వవన్ కనిపిస్తేనే కార్యక్రమం..లేదంటే నైరాశ్యం అన్నట్లుగా పరిస్థితి మారింది. కొత్త నేతలు పార్టీలోకి వచ్చే వారు కనిపించటం లేదు. దీనినే అధికారంలో ఉన్న పార్టీ అనుకూలంగా మలచుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీ పోలిట్ బ్యూరో కీలక సమావేశం జరగనుంది.
పవన్ సమర్దతకు పరీక్షగా..
ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితులు పవన్ సమర్ధతకు పరీక్షగా మారాయి. కొద్ది రోజుల క్రితం పవన్ ఏపీలో వైసీపీ ప్రభుత్వ వంద రోజుల పాలన మీద తన అభిప్రాయాలను స్పష్టం చేసారు. ఆ వెంటనే అధికార పార్టీ నేతలు పవన్ ను లక్ష్యంగా చేసుకొని వరుసగా పెద్ద ఎత్తున విమర్శలు చేసారు. కానీ, జనసేన నుండి మాత్రం వాటిని ఏ ఒక్కరూ తిప్పి కొట్టటం లేదు. పార్టీలోనే ఉంటున్నా మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇక, నాదెండ్ల మనోహర్ అధినేత ఉంటనే స్పందిస్తారు. పార్టీ కార్యక్రమాలు లేక కేడర్ అధినేత వైపు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో రెండు ప్రధాన పార్టీలను ఎదుర్కొంటూ..రాజకీయంగా తమ స్థానం సుస్ధిరం చేసుకోవటం పవన్ సమర్ధతకు పరీక్షగా మారుతోంది. ఈ సమయంలో పోలిట్ బ్యూరోలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.