ఆత్మహత్యలు చేసుకోవద్దు.. డిమాండ్లు తీర్చాలి.. ఆర్టీసీ సమ్మెపై పవన్ కల్యాణ్
అమరావతి: పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరుగుతోంది. జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జరిగిన ఈ సమావేశంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, సభ్యులు తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్, కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలస యశస్విని, డా. పసుపులేటి హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, ఎ భరత్ భూషణ్, బి నాయకర్ పాల్గొన్నారు.
వైఎస్ జగన్ చిత్రపటానికి జనసేన ఎమ్మెల్యే రాపాక పాలాభిషేకం: లైన్ క్లియర్ అయినట్టేనా?
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. శుక్రవారం నాటి పొలిట్ బ్యూరో నిర్ణయాలు రాజకీయ వ్యవహారాల కమిటీకి వెల్లడి, రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడంపై చర్చించనున్నారు.
పార్టీ శ్రేణులలో స్థైర్యాన్ని పెంపొందించి యువ నాయకత్వం బలోపేతానికి ఉద్దేశించిన పార్టీ కార్యాచరణ, కార్తీక మాసంలో పర్యావరణం పరిరక్షణ కోసం ఉద్దేశించిన కార్యక్రమాల నిర్వహణపై రాజకీయ వ్యవహారాల కమిటీ చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు, హామీలు, పథకాల అమలులో వైఫల్యాలు, విద్యుత్ సంక్షోభం, సాగుదారుల సమస్యలు, జనసేన నేతలు, శ్రేణులపై అధికార పక్షం చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుపై ఇచ్చిన హామీ అమలులో జాప్యం, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై, ఇసుక విధానం అమలులో ప్రభుత్వ వైఫల్యం... ఉపాధి కోల్పోయిన కార్మికుల స్థితిపై చర్చించనున్నారు. తెలంగాణాలో గత 16 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెపై చర్చపైనా చర్చలో కీలకంగా మారనుంది.
కాగా, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన మద్దతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల న్యాయమైన డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి డిమాండ్లను సాధించుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గత 16 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తెలంగాణలో సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం. కాగా, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళతామని ఆర్టీసీ సంఘాలు ప్రకటించాయి.