ప్రభుత్వ వ్యపస్థల్లో జనసేన ప్రాతినిధ్యం షురూ.!జీవిఎంసీలో ఫ్లోర్ లీడర్ గా వసంతలక్ష్మి.!
అమరావతి/హైదరాబాద్ : చట్ట సభల్లో జనసేన ప్రాతినిధ్యం మొదలైంది. విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్ లో జనసేన ఫ్లోర్ లీడర్ గా శ్రీమతి భీశెట్టి వసంతలక్ష్మి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా దల్లి గోవింద రెడ్డిలను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. మున్సిపల్ కార్పొరేషన్ల కౌన్సిల్ లో జనసేన పార్టీ నుంచి నియామకం జరుగుతున్న తొలి పదవులు ఇవి. జనసేన పార్టీలో వీర మహిళలకు పార్టీ అధ్యక్షులు ఎనలేని ప్రాధాన్యాన్ని ఇస్తున్న సంగతి విదితమే. పార్టీ కమిటీలలో కూడా వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు. 33 శాతం పదవులలో వీర మహిళలను నియమించాలని కూడా నిర్దేశించారు. మహిళా సాధికారతను గౌరవిస్తూ పోరాటపటిమ కలిగిన వీర మహిళ శ్రీమతి వసంత లక్షిని జనసేన ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేశారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
Recommended Video
అంతే కాకుండా జనసేన పార్టీపై గంగ పుత్రులు అవిభాజ్యమైన ప్రేమానురాగాలను చూపుతుంటారని పార్టీ ముఖ్యనేతలు వివరిస్తున్నారు. గంగవరంలో గంగపుత్రులు అధికంగా ఉంటారని, ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతమంతా మత్స్యకారులే నివసిస్తుంటారని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికలలో వారు జనసేన అభ్యర్థిని గెలిపించుకున్నారని, అందుకు కృతజ్ఞతాపూర్వకంగా గంగవరం డివిజన్ నుంచి ఎన్నికైన దల్లి గోవింద రెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఎంపిక చేశామని ముఖ్యనేతలు వివరిస్తున్నారు. మత్స్యకారుల పట్ల తనకున్న అభిమానాన్నిపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారని తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి అకుంఠిత దీక్షతో శ్రీమతి వసంత లక్ష్మి, గోవింద రెడ్డి కృషి చేస్తారని విశాఖ నగర వాసులకు తెలియచేస్తూ వారిరువురికీ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు అందచేశారు.