రావెల కిషోర్ బాబు పార్టీ మార్పు పై జనసేన స్పందన .. రావెల అవకాశవాది
ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నుండి జనసేనలో చేరిన రావెల కిషోర్ బాబు ఎన్నికల అనంతరం జనసేనను వీడి బీజేపీలో చేరారు. ఇక జనసేన పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కనీసం మాట్లాడడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ, తన సలహాలు సూచనలు ఎన్నడూ తీసుకోలేదంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో రావెల కిషోర్ బాబు పార్టీ మార్పుపై జనసేన నాయకులు స్పందించారు.
జగన్తో జనసేన ఎమ్మెల్యే భేటీ: ముఖ్యమంత్రికి అభినందనలు: సంకేతాలు ఇస్తున్నారా..!
రావెల అవకాశవాది .. అందుకే తల్లిలా ఆదరించిన పార్టీ వీడి వెళ్ళిపోయాడు అన్న జనసేన నేతలు
తల్లిలా ఆదరించిన పార్టీని రావెల కిషోర్ బాబు తన స్వార్థ ప్రయోజనాలకే వీడిపోయాడని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు .మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీ మార్పుపై గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసైనికులు మాట్లాడారు. టిడిపిని వీడి రావెల కిషోర్ బాబు ఒంటరిగానే జనసేనలో చేరాడని, ఇప్పుడు ఒంటరిగానే పార్టీని వీడి వెళ్లాడని, ఇక ఆయన పార్టీని వీడి వెళ్ళడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగలేదని వారు అభిప్రాయపడ్డారు.
గత తెలుగుదేశం పార్టీ హయాంలో రావెల కిషోర్ బాబు మంత్రిగా పని చేసినప్పటికీ పార్టీ శ్రేణులను కలుపుకోలేని స్వభావంతో రావెల తెలుగుదేశం పార్టీలోనూ ఒంటరి పోరాటం చేశాడని గుర్తు చేశారు . అలాంటి వ్యక్తికి జనసేనలో స్థానం కల్పిస్తే అవకాశవాద రాజకీయాలు చేస్తూ పార్టీని వీడి వెళ్లాడని ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన నేతలు పేర్కొన్నారు.
పవన్ రావెలకు సోదర స్థానం ఇచ్చి గౌరవించారు.. కానీ ఆయన బుద్ధి మారలేదన్న జనసైన్యం
ఇక టీడీపీలో పార్టీ శ్రేణులు రావెల కిషోర్ బాబు ని ఎంత హీనంగా చూశారో అందరికీ తెలుసన్నారు. టిడిపిలో పలు అవమానాలకు గురవుతున్న రావెల కిషోర్ బాబును పవన్ కళ్యాణ్ ఆదరించి పార్టీలో చేర్చుకుని సోదర స్థానం ఇచ్చినట్లు వారు వివరించారు.పవన్ కళ్యాణ్ అంతగా ఆదరిస్తే చివరకు పార్టీ మారి పవన్ కళ్యాణ్ పైన సంచలన ఆరోపణలు చెయ్యటం ఆయన బుద్ధికి నిదర్శనం అన్నారు.రావెల కిషోర్ బాబు మాత్రం తన బుద్ధి మార్చుకోకుండా పవన్ నమ్మకాన్ని వమ్ము చేసి ఎన్నికల అనంతరం జనసేనను వీడి బిజెపికి జై కొట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రావెల కిషోర్ బాబు పార్టీ మార్పుతో జనసేన కు వచ్చిన నష్టమేమీ లేదని వారన్నారు.
పార్టీ మారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన రావెల
ఇక తాజాగా అనూహ్యం మోడీ సమక్షంలో బీజేపీలో చేరిన రావెల కిషోర్ బాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు పార్టీలో సరైన స్థానం ఇవ్వలేదని ,జనసేన కీలక నేతలతో తాను ఒకడినని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తనకు అంత ప్రయారిటీ ఇవ్వలేదని రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ తనకు ఎప్పుడూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, కనీసం ఫోన్ అయినా మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని పేర్కొని పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు. పైకి సన్నిహితంగా అనిపించినా, ఆయన అంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి కాదని, రాజకీయ వ్యూహాలపై చర్చించేందుకు ఏ రోజు అవకాశం ఇవ్వలేదని రావెల పేర్కొన్నారు. ఇక ఈ నేపధ్యంలోనే జనసేన నేతలు స్పందించారు.