జగన్తో జనసేన ఎమ్మెల్యే భేటీ: ముఖ్యమంత్రికి అభినందనలు: సంకేతాలు ఇస్తున్నారా..!
ఏపీ శాసనసభలో కొత్త ట్విస్ట్. ఏకైక జనసేన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు. ఆయనకు అభినందన లు తెలిపారు. ప్రస్తుతం సభలో రాపాక వరప్రసాద్ జనసేన నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరే ప్రయత్నాలు చేసారు. కానీ, జనసేనలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోగా.. వర ప్రసాద్ ఒక్కరు మాత్రమే గెలిచారు. శాసనసభలో తొలి రోజే ఆయన సీఎం జగన్ తో సమావేశం అవ్వటం ఇప్పుడు కొత్త సమీకరణాలకు కారణం అవుతుందా...
జనసేన ఎమ్మెల్యే ఎందుకు కలిసారు..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ను జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కలిసారు. శాసనసభ తొలిరోజు సమావేశాలు సందర్భంగా బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం జగన్తో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తొలిసారి శాసనసభకు వచ్చిన జగన్ను మర్యాదపూర్వకంగా పలకరించి, అభినందనలు తెలిపారు. ఆయనతో సీఎం జగన్ కొద్దిసేపు మాట్లాడి సభలోకి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... మంత్రివర్గ విస్తరణలో సీఎం వైఎస్ జగన్ సామాజిక న్యాయం పాటించారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీల ను నిలబెట్టుకుంటే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుండి గెలిచిన రాపాక వరప్రసాద్ ఇప్పుడు జగన్తో భేటీ అవ్వటం చర్చనీయాంశంగా మారింది.
జనసేనలోనే ఉంటారా..
ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేగా ఉంటూ ముఖ్యమంత్రిని అభినందించటం పైన అనేక సందేహాలు మొదలయ్యాయి. ఆయన ఇప్పుడు సభలో జనసేనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇతర పార్టీ నేతలను ఫిరాయింపుల ద్వారా తమ పార్టీ లోకి తీసుకొనే ప్రసక్తి లేదని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేసారు. జనసేన అధినేతకు విధేయుడిగా ఉన్న రాపాకా వర ప్రసాద్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసారు. వైయస్కు విధేయుడిగా ఉండేవారు. ఇక, ఇప్పుడు టీడీపీ సంఖ్యా బలం కేవలం 23 మంది మాత్రమే. జనసేన ఎమ్మెల్యే ప్రతిపక్ష సభ్యుడిగా టీడీపీకి సహకరించే పరిస్థితి లేదు. దీంతో ..ఆయన అధికార పార్టీకి అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తోందని అసెంబ్లీ లాబీల్లో అప్పుడే చర్చ మొదలైంది. మరి.. రాపాక ప్రస్తుతానికి అయితే జనసేన సభ్యుడిగానే కొనసాగే అవకాశం ఉంది. మరి..రానున్న రోజుల్లో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
నోరు విప్పని పవన్ కళ్యాన్..
ముఖ్యమంత్రిగా జగన్ పదిహేను రోజుల పాలన పైన టీడీపీ నేతలు భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే, ఎన్నికల ఓటమికి కారణాల పైన వరుస సమీక్షలు చేస్తున్న పవన్ కళ్యాన్ కొత్త ప్రభుత్వం పాలన పైన మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రధాని మోదీకి జగన్ భయపడుతున్నారంటూ కామెంట్ చేసిన పవన్.. ఏపీ కొత్త కేబినెట్ కూర్పు..అదే విధంగా తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయాల మీద స్పందించలేదు. మరి..అధినేత అభిప్రాయం ఏంటో తెలుసుకొని సభలో రాపాక వరప్రసాద్ వ్యవహరిస్తారా లేక రాబోయే రోజుల్లో నేరుగా పవన్ కళ్యాన్ స్పందిస్తారా అనేది వేచి చూడాలి.