అంబటీ! అంత ఆవేశం ఎందుకు?: అవిశ్వాసంపై జగన్ పార్టీని నిలదీసిన జనసేన
Recommended Video
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు పోరాడుతున్నాయి.. కానీ ఏ పార్టీ మరో పార్టీతో కలిసి పోరాటం చేసేందుకు ఇష్టపడటం లేదు. అయితే, జనసేన పార్టీ మాత్రం ఏ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాడినా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తోంది.
పవన్! ఎలా నమ్మాలి? బాబుపై అలా.. జగన్పై ఇలా: నాశనం చేస్తున్నారని ఏకేసిన అంబటి
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాము పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడతామని, అందరి మద్దతు కూడగడతామని, అయితే, టీడీపీ కూడా తమదో కలిసి రావాలని అన్నారు.
21 వరకూ ఎందుకు? జగన్ పార్టీకి జనసేన ప్రశ్న
ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మార్చి 21న అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించారు. అయితే, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు మార్చి 21వ తేదీ వరకూ ఎందుకు గడువు పెట్టుకుందో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని జనసేన పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన భగత్సింగ్ స్టూడెంట్స్ యూనియన్(బీఎస్యూ) డిమాండ్ చేసింది. పార్లమెంటు సమావేశాలు మార్చి 5వ తేదీ నుంచే ప్రారంభమవుతుంటే 21వ తేదీ వరకూ ఎందుకు ఆగాలనుకుంటున్నారో తెలియజేయాలని ఒక ప్రకటనలో కోరింది.
పవన్ కళ్యాణ్ వాటిని ప్రస్తావించలేదు
అంతేగాక, ‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అంశానికి సంబంధించి పవన్కల్యాణ్ చెప్పింది తప్పు అంటూ ఇటీవల వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అయితే పవన్కల్యాణ్ ప్రసంగంలో ఎక్కడా రాజ్యాంగం గురించి మాట్లాడలేదు. లోక్సభా నియమ, నిబంధనలనే ప్రస్తావించారు' అని బీఎస్యూ స్పష్టం చేసింది.
అంబటీ.. ఎందుకంత ఆవేశం
‘ప్రకాశం జిల్లా కందుకూరులో జగన్ చేసిన సవాల్కు పవన్కల్యాణ్ ప్రతిస్పందించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే తాను మద్దతు కూడగడతానన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ పనిచేయకపోతే టీడీపీ అయినా చేయాలని చెప్పారు. దానిపై అంబటి రాంబాబు అంతలా ఆవేశపడాల్సిన అవసరం ఏమొచ్చింది' అని ఆ ప్రకటనలో ప్రశ్నించింది.
అంబటి ఈ వీడియో చూడు..
లోక్సభ నిబంధనల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన రూల్ 198 ప్రతితో పాటు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అవిశ్వాస తీర్మానంపై చేసిన వివరణాత్మక సమాచారంతో కూడిన వీడియో లింక్ను అంబటి రాంబాబుకు పంపిస్తున్నట్లు ప్రకటనలో వివరించారు. దాన్ని చూడాల్సిందిగా కోరారు.