అమరావతిపై 30న జనసేన కార్యాచరణ...
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు , అమరావతి ప్రజలు, రైతుల ఆందోళనపై చర్చించి పార్టీ తరపున నిర్ణయం ప్రకటించేందుకు గాను జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈనెల 30 తేదిన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం జరగనున్నట్టు తెలిపారు. కాగా ఈ సమావేశంలో పార్టీ పోలీట్ బ్యూరో, రాజకీయ వ్యవహారాల కమిటీ ,పార్టీ వ్యూహత్మక కమిటీ తోపాటు ఇతర ప్రాంతాల పార్టీల భాద్యులు ,కీలక నేతలు పాల్గోననున్నారు.
అమరావతిపై 30న తేల్చనున్న జనసేన
ఆంధ్రప్రదేశ్ రైతులు, రాజధాని ఆందోళనపై పార్టీ పరంగా తన స్టాండ్ను ప్రకటించేందుకు జనసేన సిద్దమైంది. పార్టీ పరంగా మూడు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలను తీసుకుని తుది నిర్ణయానికి రానున్నారు. కాగా ఇప్పటికే రాజధాని తరలింపు , రైతుల ఆందోళనపై వైసీపీ ప్రభుత్వం జీఎన్ రావు కమిటీ నివేదికను అమోదించిన అనంతరమే పార్టీ నిర్ణయం వెలువరుస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాన్ ప్రకటించారు. శుక్రవారం జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అమోదించేందుకు దాదాపుగా సిద్దమయింది. ఈ నేపథ్యంలోనే జనసేన నిర్ణయాన్ని వెలువరించాలని అధినేత పవన్ కళ్యాన్ నిర్ణయించారు.
రాజధాని ప్రాంతంలో పర్యటించిన జనసేన
అమరావతి నుండి రాజధాని తరలింపును పవన్ కళ్యాన్ ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి తప్ప అధికార వికేంద్రీకరణను జనసేన కోరుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు పార్టీ నేత నాదేండ్ల మనోహర్ నేతృత్వంలో కమిటీ పర్యటించింది. అనంతరం రాష్ట్ర క్యాబినెట్ అధికారిక నిర్ణయం తర్వాత స్పందిస్తామని నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం.
జనసేన కార్యచరణ ఎలా ఉండబోతుంది
కాగా రాజధాని నిర్మాణం , ఇతర ప్రాంతాల అభివృద్దిపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జీఎన్ రావు ఇచ్చిన నివేదికను యధావిధిగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. మరోవైపు విశాఖలో పరిపాలన రాజధాని కోసం కావాల్సిన ఏర్పాట్లను సైతం చేస్తున్నారు. దీంతో దాదాపు రాజధాని తరలింపు ఖారారైంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పూర్తయిన తర్వాత తిరిగి ప్రభుత్వంపై జనసేన ఎలా ఒత్తిడి తెస్తారని సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే పలు పార్టీలు దీక్షలు ఆందోళనలు చేస్తుండగా .. జనసేన మాత్రం రాజధాని తరలింపుపై ఎలాంటీ కార్యచరణ ప్రకటించలేదు... మరి 30వ తేది సమావేశం తర్వాత ఎలాంటి కార్యచరణ ప్రకటిస్తారనేది వేచి చూడాలి.